శివాజీకి బీజేపీ సెగ?: గన్నవరం విమానశ్రయం వద్ద ఉద్రిక్తత..
గన్నవరం: సినీ నటుడు శివాజీని గన్నవరం విమానశ్రయంలో బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. శివాజీ కారుకు అడ్డుపడి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తతలకు తావివ్వడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.
శివాజీకి రక్షణ కవచంగా నిలబడి ఆయన్ను విమానశ్రయం నుంచి పంపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కన్నా లక్ష్మీ నారాయణ ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన విజయవాడ చేరుకోనున్న నేపథ్యంలో.. గన్నవరం విమానశ్రయం వద్ద బీజేపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు వెళ్లాయి.
అదే సమయంలో హైదరాబాద్ నుంచి గన్నవరం విమానశ్రయంలో అడుగుపెట్టిన శివాజీని చూసి బీజేపీ శ్రేణులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని శివాజీ టార్గెట్ చేయడంతో.. మోడీనే విమర్శిస్తావా? అంటూ కొంతమంది నేతలు దుర్భాషలాడినట్టు తెలుస్తోంది.
బీజేపీ నేతలు శివాజీ కారును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. పోలీసులు వారిని వారించారు. శివాజీకి రక్షణ కవచంగా నిలిచి అక్కడినుంచి పంపించడంతో ఉద్రిక్తతలకు తెరపడింది.