పవన్! మేం పిచ్చోళ్లమా? జీ హుజూర్ అనాలా? బాబు, లోకేష్ అవినీతిపరులా?: శివాజీ ఆగ్రహం
హైదరాబాద్: ఓ జాతీయ పార్టీ దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక ఆపరేషన్ చేసిందని సంచలన ఆరోపణలు చేసిన సినీ నటుడు శివాజీ.. తాజాగా ఓ తెలుగు న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ పలు కీలక అంశాలపై స్పందించారు. ఏపీ ప్రయోజనాల కోసమే తాను పోరాటం చేస్తున్నానని చెప్పారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లు అవినీతి పరులు కాదని శివాజీ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు.

అందుకే ఆపరేషన్ బయటపెట్టా
తనకు తెలిసిన విషయాన్ని సూటిగా చెప్పానని ‘ఆపరేషన్ ద్రవిడ' పేరిట సంచలన వ్యాఖ్యలు చేసిన శివాజీ అన్నారు. ‘‘ఆపరేషన్ గరుడ' ఆంధ్ర ప్రజలను అప్రమత్తం చేయడానికే బయటపెట్టాను. ఇంత కీలకమైన సమాచారాన్ని నేను సంవత్సరం క్రితమే సేకరించాను. తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇదే సరైన సమయం అని భావించి ఆ విషయాలను బయటపెట్టాను' అని శివాజీ చెప్పారు.

నేను ఫెయిల్యూర్ కాదు..
‘నేను బీజేపీ కుట్ర గురించి బయటపెడితే.. టీడీపీ వాడినంటూ నాపై ముద్ర వేస్తున్నారు. నాకు ఏ పార్టీలు, పదవులు వద్దు. నా అస్థిత్వం కోసం నేనేమీ పాకులాడట్లేదు. నాపై వస్తున్న విమర్శలను పట్టించుకోను. నాకు సినిమాలు లేకపోవడంతోనే ఇదంతా చేస్తున్నానని విమర్శిస్తున్నారు. నా చివరి సినిమా 'బూచమ్మ బూచోడు'. ఈ సినిమా హిట్ అయింది. నేనేమీ ఫెయిల్యూర్ నటుడిగా బయటకు రాలేదు. ఇప్పటివరకు 90 సినిమాల్లో నటించాను' అని శివాజీ వ్యాఖ్యానించారు.

పవన్లో చాలా మార్పు
‘ప్రశ్నించండి' అని పవన్ కల్యాణ్ అన్నారుగా, అందుకే, ఆయన్ని తాను ప్రశ్నిస్తున్నానని శివాజీ అన్నారు. ‘‘ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు' అంటూ నాడు పవన్ కల్యాణ్ చేసిన సుదీర్ఘ ప్రసంగం అందరికీ నచ్చింది. పవన్ కల్యాణ్ రోడ్డు మీదకొస్తే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆ తర్వాత నేను చెప్పాను. మొన్న, గుంటూరు బహిరంగ సభలో పవన్ మాట్లాడిన విధానాన్ని పరిశీలిస్తే చాలా మార్పు కనపడింది' శివాజీ అని తెలిపారు.

పవన్ .. మేమైనా పిచ్చోళ్లమా?.. జీ హుజుర్ అనాలా?
అంతేగాక, ‘ప్రధాన మంత్రి మనల్ని పట్టించుకునే పరిస్థితిలో లేరని చెప్పిన పవన్ .. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రధాని తనతో బాగానే ఉంటారని చెప్పారు. మూడు సంవత్సరాల్లో పవన్ చక్కగా మూడు సినిమాలు చేసుకున్నారు... చక్కగా సంపాదించేసుకున్నారు. మొన్న బహిరంగసభలో లోకేశ్పై అవినీతి ఆరోపణలు చేశారు. ఆధారాలేవని అడిగితే.. ‘బయట అనుకుంటున్నారు' అని పవన్ చెబుతున్నారు. మీరు ఎంత గొప్ప హీరో అయినప్పటికీ, మీరు చెప్పే ప్రతిదానికీ ‘జీ హుజూరు' అనడానికి మేము ఏమైనా పిచ్చోళ్లమా? ప్రశ్నించమని మీరే అన్నారు, అందుకే, ప్రశ్నిస్తున్నాను' అని శివాజీ తేల్చి చెప్పారు.

బాబునే అడగండి..
టీటీడీ చైర్మన్ పదవి కావాలని తానెన్నడూ అడగలేదని శివాజీ స్పష్టం చేశారు. ‘టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వనందుకే మీకు బీజేపీ, టీడీపీపై ఒకేసారి కోపం వచ్చినట్టుంది' అనే ప్రశ్నకు శివాజీ స్పందిస్తూ.. ‘టీటీడీ చైర్మన్ పదవి లేదా టీటీడీ సభ్యుడి పదవి.. కనీసం దర్శనానికి ఓ టికెట్టు ఇవ్వమని కూడా నేను ఎవర్నీ అడగలేదు. ఈ విషయాన్ని చంద్రబాబునాయుడిని అడగండి. నేను అడిగానని చెబితే నన్ను ఉరేయండి. నాకు ఆ పదవి కావాలనే కోరికే ఉంటే, చంద్రబాబునాయుడు గారితో, బీజేపీతోనే నేను కలిసి ఉండాలిగా?' అని శివాజీ ప్రశ్నించారు.

హోదా వచ్చే వరకు నటించను
కాగా, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకూ తాను సినిమాల్లో నటించనని శివాజీ స్పష్టం చేశారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, ఎన్నికల్లో పోటీ చేయనని అన్నారు. చంద్రబాబు, లోకేష్లు అవినీతి పరులు కాదని అన్నారు. అయితే, టీడీపీలోని కొందరు ప్రజాప్రతినిధుల అవినీతి అక్రమాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని అన్నారు. వారిని చంద్రబాబు నియంత్రించాలని అన్నారు. ప్రాంతీయ పార్టీలంటే అవినీతి ఉంటుందని, అది పవన్ అయినా.. జగన్ అయినా.. తాను పెట్టినా అదే జరుగుతుందని శివాజీ వ్యాఖ్యానించారు. తమ బంధువు రూ. 70లక్షలకు భూమి కొన్న చోటే.. పవన్కు మాత్రం రూ.20లక్షలకే ఆ మేర భూమి లభించడం దేనికి నిదర్శనమని అన్నారు.












Click it and Unblock the Notifications