ఎదురొచ్చిన మృత్యువు: ఆరుగురి దుర్మరణం, దైవదర్శనానికి వెళ్లివస్తుండగా...
వారంతా ఆనందోత్సోహాలతో జాతరకు వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని స్వగ్రామాలకు తిరుగుపయనమయ్యారు. వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు.
వాంకిడి: వారంతా ఆనందోత్సోహాలతో జాతరకు వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని స్వగ్రామాలకు తిరుగుపయనమయ్యారు. వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. గుర్తు తెలియని వాహనం వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది.
కుమరం భీం జిల్లా వాంకిడి మండలం బెండార గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కెరమెరి మండలానికి చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు మృత్యువుతో పోరాడుతున్నారు. సరండి గ్రామసమీపంలో గల బోడగుట్ట భవానీ మాత ఆలయంలో పొలాల అమావాస్య మరుసటి రోజు జాతర నిర్వహిస్తారు.
మంగళవారం నిర్వహించిన జాతరలో కెరమెరి మండలంలోని లింబుగూడ, అగర్వాడ, సాంగ్వి, ఝరి గ్రామాలకు చెందిన 11 (ఆటో డ్రైవర్తో కలుపుకొని) మంది పాల్గొన్నారు. అనంతరం ఆటోలో తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది.
ఆదె తిరుపతి (22), వెడ్మ అంబరావు (25) అనే వ్యక్తులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మోహర్లే సంతోష్ (18) అనే యువకుడు మరణించగా, మంచిర్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా లెండిగూరె రమేష్, మోహర్లె జ్ఞానేశ్వర్, నిగ్రపు నవీన్ అనే ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.
ప్రమాదంలో మోహర్లె తిరుపతి, రాంచందర్, మోహర్లె రాందాస్, వడాయి గణేష్, ఠాక్రే రవిందర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి ఆసిఫాబాద్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.