హైకోర్టును తరలించవద్దు: ఆరు జిల్లాల న్యాయవాదుల తీర్మానం : విధుల బహిష్కరణ..!
ఏపీలో మూడు రాజధానుల గురించి ముఖ్యమంత్రి ప్రతిపాదన..జీఎన్ రావు కమిటీ సిఫార్సులతో ఇప్పటికే అమరావతిలో స్థానికులతో పాటుగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక, ప్రస్తుతం అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు తరలించి..అక్కడ జ్యుడీషియరీ రాజధాని చేయాలనే ప్రభుత్వ నిర్ణయం పైనా నిరసనలు మొదలయ్యాయి. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఏకంగా ఆరు జిల్లాల న్యాయవాదులు నిర్ణయించారు.
నేటి నుండి ఈనెల 27వ తేదీ వరకు కోర్టు విధులను బహష్కరించి నిరసన తెలపాలని అడ్వొకేట్స్ జేఏసీ తీర్మానించింది. ప్రతిరోజూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈనెల 24న చలో హైకోర్టు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఈ వ్యవహారం ప్రభుత్వానికి మరో సమస్యగా మారుతోంది.

హైకోర్టు తరలింపును నిరసిస్తూ..
రాష్ట్ర విభజన తరువాత గత ఏడాది ఏపీకి హైకోర్టు విభజన జరిగి..తాత్కాలికంగా నేలపాడులో ఏర్పాటు చేసారు. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ ప్రజల డిమాండ్ మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సంకేతాలిచ్చారు. అక్కడే హైకోర్టు ఏర్పాటు చేసి..విశాఖ.. అమరావతిలో హైకోర్టు బెంచ్ ల ఏర్పాటు దిశగా జీఎన్ రావు కమిటీ సైతం సిఫార్సులు చేసింది. ప్రభుత్వం ఇంకా దీని మీద అధికారికంగా నిర్ణయం మాత్రం ప్రకటించలేదు. దీని పైన విజయవాడలో ఆరు జిల్లాల బార్ అసోసియేషన్లు సమావేశమయ్యాయి. హైకోర్టు తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసారు. దీని కోసం నిరసనబాట పట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కార్యాచరణను ప్రకటించారు.

విధుల బహిష్కరణ..ఛలో హైకోర్టు..
హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి ఈనెల 27వ తేదీ వరకు కోర్టు విధులను బహష్కరించి నిరసన తెలపాలని అడ్వొకేట్స్ జేఏసీ తీర్మానించింది. ప్రతిరోజూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగించాలని.. ఈనెల 24న చలో హైకోర్టు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ తీర్మానంలో కృష్ణాజిల్లాతో పాటుగా గుంటూరు.. పశ్చిమ గోదావరి.. తూర్పు గోదావరి..ప్రకాశం.. నెల్లూరు జిల్లాలకు చెందిన బార్ అసోసియేషన్ ప్రముఖుల పాల్గొన్నారు. వారంతా ఈ నిర్ణయానికి ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. ఇక, ప్రభుత్వం నుంచి విస్పష్ట ప్రకటన వచ్చే దాకా ఉద్యమం తీవ్రతరం చేయాలని తీర్మానంలో స్పష్టం చేసారు.

ఆరు జిల్లాల్లోనూ నిరసనలు..
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా లాయర్లు ఈ రోజు నుండి ఆరు జిల్లాల్లో విధుల బహిష్కరణకు నిర్ణయించారు. ఇప్పటికే అమరావతిలో స్థానికులు..రైతుల నుండి ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక, ఇప్పుడు న్యాయవాదులు సైతం ఆందోళనకు పిలుపునిచ్చారు. ఏకంగా ఆరు జిల్లాలకు చెందిన న్యాయవాదులు ఇందులో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోకుమందే..ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో తమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ కర్నూలు న్యాయవాదులు కొద్ది రోజుల క్రితం వరకూ ఆందోళన చేసారు. ఇప్పుడు..ప్రభుత్వ ఈ సమస్య మీద ఏ రకంగా స్పందిస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications