ఆన్లైన్ సేవా టికెట్ల స్కాం: ఆరుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ ఈవో ఆదేశాలు
తిరుపతి: ఆర్జిత సేవల కుంభకోణం కేసులో ఏడుగురు ఉద్యోగులపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చర్యలు తీసుకుంది. ఆరుగురిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ శుక్రవారం ఈవో జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవోపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి టీటీడీ సిఫారసు చేసింది. పలు ఆర్జిత సేవా టికెట్లను 30ఏళ్లకు విక్రయించినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈవో చర్యలు తీసుకున్నారు.
పనినే దైవంగా భావించాలి: నూతన ఉద్యోగులకు ఈవో జవహర్ రెడ్డి
నూతన ఉద్యోగులు పనినే దైవంగా భావించాలని, శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల్లో భగవంతుని చూసి అంకితభావంతో సేవలందించాలని టీటీడీ ఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి కోరారు. టిటిడిలో ఒకేసారి కారుణ్య నియామకాలు పొందిన 119 మంది ఉద్యోగులకు తిరుపతి శ్వేత భవనంలో 15 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈఓ, జెఈఓ సదా భార్గవితో కలిసి 119 మంది ఉద్యోగులకు పోస్టింగులు అందజేశారు.
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ, నిబద్ధత, చిత్తశుద్ధితో పని చేసి టిటిడికి మంచి పేరు తేవాలన్నారు. ప్రభుత్వ జిఓలు, టిటిడి చట్టాలు, సర్వీస్ నిబంధనలపై పట్టు పెంచుకుని మెరుగ్గా కార్యాలయ విధులు నిర్వహించాలని సూచించారు. అర్హత గల ఉద్యోగులు పలు పోటీ పరీక్షలు కూడా రాసి ఉన్నతస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తన ఐఏఎస్ శిక్షణ కాలంలో నేర్చుకున్న విషయాలు అనంతరం ఉద్యోగ సమయంలో ఎలా ఉపయోగపడ్డాయనే విషయాలు, సొంత అనుభవాలను ఈ సందర్భంగా ఈఓ తెలియజేశారు.
Recommended Video
జెఈఓ సదా భార్గవి మాట్లాడుతూ.. ఈ ఉద్యోగాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి ఇచ్చిన అరుదైన అవకాశంగా భావించాలన్నారు. ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా విధులు నిర్వహించి టిటిడి ప్రతిష్టను కాపాడాలన్నారు. నూతన ఉద్యోగులందరూ శ్వేత భవనంలో మొక్కలు నాటారని, వీటిని సంరక్షించాల్సిన బాధ్యత వారే తీసుకోవాలని సూచించారు. టిటిడి ముఖ్య అంకణీయ అధికారి శ్రీ శేషశైలేంద్ర మాట్లాడుతూ టిటిడిలో ఉద్యోగం పూర్వజన్మ సుకృతమని, నూతనంగా ఉద్యోగాలు పొందిన వారు సేవాభావంతో విధులు నిర్వహించాలని కోరారు.