ఏపీలో వచ్చే నెల ఆరు సంక్షేమ పథకాల అమలు: వాటి తేదీలు.. లిస్ట్ ఇదే
అమరావతి: రాష్ట్రంలో వచ్చేనెల ఏకంగా ఆరు సంక్షేమ పథకాలు అమలు కానున్నాయి. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని నెల పొడవునా వివిధ సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకుని రావడానికి జగన్ సర్కార్ వరుస సమీక్షలను నిర్వహిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాలతో పాటూ విద్యార్థులకు ఉద్దేశించిన పథకాలు ఈ జాబితాలో ఉన్నాయి. సంక్షేమ క్యాలెండర్కు అనుగుణంగా వాటి తేదీలను అధికారులు ఖరారు చేశారు.
వైఎస్సార్ బీమా పథకంతో ఏప్రిల్కు సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రారంభమౌతాయి. 6వ తేదీన వైఎస్సార్ బీమా అమలవుతుంది. వైఎస్సార్ బీమా పథకానికి అర్హత ఉండి, దాని పరిధిలో లేకుండా మరణించిన వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనల ప్రకారం బీమా వర్తించడానికి అవకాశంలేని ఈ కుటుంబాలకు కూడా భరోసా కలిగించడానికి ప్రభుత్వమే లబ్దిదారుల ప్రీమియాన్ని చెల్లిస్తుంది. ఈ పథకం కింద అదనంగా 12,039 కుటుంబాలకు ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం 6వ తేదీన విడుదల చేస్తుంది.
గత ఏడాది అక్టోబరులో వైఎస్సార్ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రారంభించిన తేదీని ప్రాతిపదికన తీసుకుని, దీన్నిరూపొందించారు. తాజాగా ఇందులో సవరణలు చేశారు. అర్హత ఉండి, నిబంధనల ప్రకారం బీమా పరిధిలోకి రాలేకపోయిన 11,022 మంది సాధారణ పరిస్థితులతో మృతిచెందినట్లు గుర్తించారు. మరో 1,017 మంది ప్రమాదవశాత్తు మరణించడం లేదా శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారని నిర్ధారించారు.
కొత్తగా గుర్తించిన 12,039 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 258 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. వచ్చేనెల 6వ తేదీన వైఎస్ జగన్ వారికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. 9వ తేదీన తొలివిడత జగనన్న విద్యాదీవెన పథకం అమల్లోకి వస్తుంది. దీనికింద అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడానికి ఉద్దేశించిన మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. 13వ తేదీన ఉగాదిని పురస్కరించుకుని వార్డు, గ్రామ వలంటీర్లను ప్రభుత్వం సత్కరించనుంది. 16వ తేదీన రైతులకు సున్నా వడ్డీ పథకం, 20న మహిళా పొదుపు సంఘాలకు వడ్డీ స్కీమ్, 27వ తేదీన జగనన్న వసతి దీవెన కార్యక్రమం అమల్లోకి వస్తుంది.