శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు: బయటికి పరుగులు తీసిన జనం
శ్రీకాకుళం: జిల్లాలో పలుచోట్ల బుధవారం ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ప్రకంపనల ధాటికి ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, అక్కుపల్లి హరిపురం, రాజాం, సోంపేట మండలంలోని బారువా, మామిడిపల్లి, ఎర్రముక్కాం, ఉప్పాల, తాళ్ల భద్ర, కంచిలి తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
బుధవారం ఉదయం 7:20 నిమిషాలకు భూమి స్వల్పంగా కంపించిందని, ప్రకంపనలకు ముందు పెద్ద శబ్దం రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
రెండు సెకన్లు నుంచి పది సెకన్లు పాటు భూమి కంపించిందని ఆయాగ్రామాల ప్రజలు తెలిపారు. కొందరి ఇళ్లల్లో సామగ్రి కింద పడిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
స్థిరంగా ఉపరితల ఆవర్తనం
ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకొని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ఒకట్రెండు రోజుల్లో ఇది బలపడి అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వానలు కురిసే అవకాశాలున్నాయి.