స్మగ్లర్ను కాను: బదానియా ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతి: ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్దాయిలో తన హవాని కొనసాగిస్తున్నాడని పోలీసులు అరోపిస్తున్న ముఖేష్ బదానియా సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖేష్ బదానియాని అరెస్టు చేసిన పోలీసులు అతడిని సోమవారం ఉదయం కోర్టుకు హాజరుపరిచే నిమిత్తం భారీ బందోబస్తు మధ్య కడపకు రైలులో తీసుకొస్తున్నారు.
ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడిన ముఖేష్ బదానియా తాను ఎర్రచందనం విక్రయిస్తున్న మాట వాస్తవమేనని చెప్పాడు. అయితే తాను చేస్తున్న వ్యాపారం అక్రమం కాదని, పూర్తి స్ధాయిలో చట్టబద్ధంగానే కొనసాగిస్తున్నానని ముఖేష్ బదానియా చెప్పాడు.
ఎర్రచందనం వ్యాపారం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ అనుమతి తీసుకున్నానని చెప్పాడు. హర్యానాలోని హిస్సార్లో ఎర్ర చందనం స్మగ్లర్ ముఖేష్ బదానియాను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని పోలీసులు కడపకు తీసుకు వస్తున్నారు. ట్రాన్సిట్ వారెంటు పైన బదానియాను తీసుకు వస్తున్న పోలీసులు సోమవారం కడప కోర్టులో హాజరుపరచనున్నారు.
బదానియాను విచారించడం ద్వారా చాలామంది స్మగ్లర్ల విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాల బడా స్మగ్లర్లతో ఇతనికి మంచి సంబంధాలు ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బదానియా చిత్తూరు, కడప జిల్లాలను టార్గెట్ చేసుకుని స్మగ్లింగ్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది.
ఎర్రచందనంతో బొమ్మలు, రుద్రాక్షలు తయారీ చేసేవాడని బదానియా తెలిపాడు. ఎర్రచందనంపై సరైన అవగాహన లేకపోవడంతో హిస్సార్ పోలీసులు ముఖేష్ బదానియాను పట్టించుకోలేదు. దీనిని ఆసరగా చేసుకుని తన ఇంటి ముందే యధేచ్చగా బొమ్మలు తయారీ చేసేవాడు.
తాను తయారు చేసిన బొమ్మలను విదేశాలకు ఎగుమతి చేసేవాడు. ఇలా అంతర్జాతీయ స్ధాయిలో ఎర్రచందనం అమ్మకాల్లో ముకేశ్ కొత్త ఎత్తులను నేర్చుకున్నాడు. వీటితో పాటు ఎర్రచందనాన్ని ఏకముఖి రుద్రాక్షలుగా చెక్కి మోసాలకు పాల్పడేవాడు.
బదానియా అంతర్జాతీయ స్మగ్లర్: కడప ఎస్పీ
హర్యానాలోని హిస్సార్లో పట్టుబడిన ముఖేష్ బదానియా అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లరని కడప జిల్లా ఎస్పీ నవీన్ గులాఠి చెప్పారు. హిస్సార్లోని బదానీ గోదాముకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవన్నారు.
కడప జిల్లాకు చెందిన పలువురు స్మగ్లర్లతో బదానీకి సంబంధాలున్నాయని, గంగిరెడ్డితో సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నట్లు ఆయన తెలిపారు. భారీ భద్రత నడుమన రైలులో పోలీసులు బదానియాని తీసుకొస్తున్నారని, సోమవారం రాత్రికి కడప జిల్లాకు చేరుకుంటారని చెప్పారు.