శోభా నాగిరెడ్డి పరిస్థితి విషమం: కేర్లో వెంటిలెటర్ పైన
ప్రస్తుతం శోభా నాగిరెడ్డి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థో, న్యూరో ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ ముగ్గురు కలిసి శోభా నాగిరెడ్డిని పరీక్షించి చికిత్సను అందిస్తున్నారు. శోభా నాగిరెడ్డితో పాటు ఆమె భర్త భూమా నాగిరెడ్డి కూడా హైదరాబాదుకు వచ్చారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన శోభా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని కేర్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు పర్యవేక్షణలో మూడు బృందాలు పని చేస్తున్నాయి. గురువారం ఉదయం సిటీ స్కాన్ తీశారు. పూర్తి స్థాయిలో పరీక్షల అనంతంర ఏ చికిత్స అందిస్తారో చెబుతామని వైద్యులు చెబుతున్నారు. వెంటిలెటర్ ద్వారా శ్వాస అందిస్తున్నారు.
కాగా, శోభా నాగిరెడ్డి బుధవారం రాత్రి నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు వెళ్తుండగా గూబగుండం మిట్ట సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. బుధవారం నంద్యాలలో షర్మిల పర్యటించారు. ఆమెతో పాటు శోభా నాగిరెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. రాత్రి పదిన్నర గంటల సమయంలో షర్మిలకు వీడ్కోలు పలికి తన మిత్సుబిషి ఔట్ల్యాండర్ వాహనంలో శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డకు బయలుదేరారు.
మరికొన్ని నిమిషాల్లో ఆళ్లగడ్డకు చేరుకుంటారనగా గూబగుండం మిట్ట సమీపంలోని జాతీయ రహదారిపై స్థానిక రైతులు వేసిన ఆరబోసిన ధాన్యపు కుప్పల్లోకి ఆమె ప్రయాణిస్తున్న వాహనం దూసుకెళ్లింది. ఒక్కసారిగా అదుపు తప్పి నాలుగు పల్టీలు కొట్టింది. రోడ్డు పక్కనే ఉన్న పొలంలో పడిపోయింది. వాహనంలో ముందు సీటులో కూర్చున్న శోభా నాగిరెడ్డి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె మెడ, తల భాగానికి గాయాలయ్యాయి.
అపస్మారక స్థితిలో ఉన్న శోభా నాగిరెడ్డిని అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమెను ఐసియూలో చేర్చారు. అనంతరం హైదరాబాదు కేర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు గన్మన్, వాహనం డ్రైవర్ కూడా గాయపడ్డారు. ఈ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి, ఆమె భర్త భూమా నాగిరెడ్డి నంద్యాల అసెంబ్లీ నుంచి వైయస్సార్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.