'జూనియర్ ఎన్టీఆర్' పై 'బాలకృష్ణ' ఫైర్
హీరో అన్న తర్వాత అభిమానులుండటం ఎంత సహజమో.. సోషల్ మీడియాలో ట్రోలర్స్ ఉండటం కూడా అంతే సహజం. ప్రస్తుతం మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. ఒకప్పుడు సినిమా థియేటర్లవద్ద, సినిమా షూటింగ్ ల దగ్గర, శతదినోత్సవాల వేడుకల సమయంలో హీరోల అభిమానుల మధ్య గొడవలు జరుగుతుండేవి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో గొడవకన్నా యుద్ధం నడుస్తోంది. నందమూరి తారక రామారావు మనవడిగా టాలీవుడ్ కు పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ అంచలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్ గా మారారు.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య, బాలకృష్ణ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది. ఈనెల 20వ తేదీన హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరవలేదు. తాను హాజరుకాలేకపోతున్నానని, తన పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యుల మధ్య వేడుకలు జరుపుకోవాలనుకుంటున్నానని ఆయన ప్రకటన చేశారు. ఈ విషయంలో జూనియర్, బాలకృష్ణ అభిమానుల మధ్య హోరాహోరీగా ట్రోలింగ్ నడుస్తోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి తాతా, తండ్రి, నందమూరి అంటుంటారని, కానీ వేడుకలకు రాలేదని, సినీ పరిశ్రమ నుంచి తోటి హీరోలు హాజరైనప్పుడు రాకపోవడానికి కారణమేంటని బాలకృష్ణ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

రామ్ చరణ్, నాగచైతన్య తదితర కథానాయకులంతా హాజరయ్యారని, వారిని చూసి నేర్చుకోవాలంటున్నారు. ముందుగానే తమ హీరో రానని చెప్పాడని, అయినా విమర్శలు చేయడం భావ్యం కాదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. కావాలనే జూనియర్ పై పదే పదే విమర్శలు చేస్తున్నారని, ఎన్టీఆర్ పై నెగెటివిటీని వ్యాపింప చేస్తున్నారని తారక్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తారక్ అసలు ఏం తప్పు చేశాడని, అతనిపై ఎందుకు అంత వ్యతిరేకత అని ప్రశ్నిస్తున్నారు. ట్రోలింగ్ ఆపాలని కోరుతున్నారు. చిలికి చిలికి గాలివానలా మారినట్లు ఈ గొడవ ఎటువంటి మలుపులు తిరుగుతుందోనని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications