వివాహం తర్వాత... మహిళ వేషంలో గ్రామంలో తిరిగిన టెక్కీ వరుడు!
చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లాలో పెళ్లి కూతురు రూపంలో వరుడు రావడం జరిగింది. పెళ్లి మంటపంలోకి మీసాలతో వస్తున్న యువతిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఇంటింటికి తిరిగి ఆడపడుచులకు పసుపు, కుంకుమలు అందజేస్తూ దీవెనలు అందుకున్నారు.
ఇది గుంటూరు వంశస్థులకు పూర్వకాలం నుంచి అనుసరిస్తున్న ఆచారమని చెబుతున్నారు. ఆ ఆచారం ప్రకారం వివాహం అయిన వెంటనే వరుడు మహిళ వేషంలో గ్రామంలో తిరిగి ఆడపడుచులకు పసుపు, కుంకుమ, కానుకలు అందజేసి వారి ఆశీర్వాదం తీసుకోవాలి.
ఇప్పుడు ఈ తంతు చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం ఎస్ఎస్ కొండలో శనివారం జరిగింది. శ్రీరంగరాజపురం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన రాజేంద్రనాయుడి కుమారుడు మోహన్ నాయుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీరు.
అతనికి మర్రిపల్లెకు చెందిన గుర్రప్ప నాయుడు కూతురు లావణ్యతో పెళ్లి జరిగింది. ఆచారం ప్రకారం శనివారం ఉదయం వివాహం పూర్తయ్యాక వరుడు మోహన్ నాయుడిని ఆడవేషంలో అలంకరించారు. తర్వాత గ్రామంలో వూరేగి ఆడపడచుల ఇళ్లకు వెళ్లి పసుపు, కుంకుమ, కానుకలు అందించారు.