ప్రభుత్వానికి రిపోర్ట్ చేసిన సోమేశ్కుమార్
తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఏపీ చీఫ్ సెక్రటరీ సీఎస్ జవహర్రెడ్డిని కలిసి జాయినింగ్కు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో సోమేశ్కుమార్ కొనసాగింపును హైకోర్టు కొట్టేసింది. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఏపీకి కేటాయించగా.. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) తెలంగాణకు మార్చింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2017లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం.. క్యాట్ ఉత్తర్వులను కొట్టేసింది. సీఎస్ సోమేశ్కుమార్ను ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
ఆ తీర్పు వచ్చిన గంటల వ్యవధిలోనే కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలు జారీచేయడంతో సోమేశ్కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. కొత్తగా తనకు అప్పగించే ఏ బాధ్యతనైనా నిర్వర్తిస్తానన్నారు. సోమేశ్కుమార్ స్థానంలో తెలంగాణ కొత్త సీఎస్గా శాంతికుమారి నియమితులైన సంగతి తెలిసిందే.

శాంతికుమారిని తెలంగాణ సీఎస్ గా ఎంపిక చేసే క్రమంలో ఏపీలో రాజకీయంగా భారత రాష్ట్ర సమితికి కలిసివచ్చేలా కేసీఆర్ చూసుకున్నారంటున్నారు. కాపు వర్గం ఓటుబ్యాంకు స్థిరంగా బీఆర్ఎస్ కు ఉంటే జాతీయ పార్టీ హోదాలో తనకు కావల్సిన ఓట్ల శాతాన్ని ఏపీ నుంచి తెచ్చుకోవడానికి అవసరమవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా ఇటీవలి కాలం వరకు జనసేనలో ఉన్న కాపువర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ను నియమించారు. అంతేకాకుండా మరికొందరు కాపువర్గానికి చెందిన నాయకులు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications