'రౌడీ రాజకీయాలు మానుకో జగన్.. నీ వయసెంతా?, స్థాయెంత?'
ఎమ్మెల్యే అఖిలప్రియపై దాడిని భూమా నాగిరెడ్డి ఖండించారు. ఆమె కారును ఆపి వైసీపీ నేతలు దాడికి దిగడం సరికాదన్నారు. ప్లాన్ ప్రకారమే అఖిలపై దాడిచేశారని ఆరోపించారు.
గుంటూరు: వైసీపీ అధినేత జగన్ రాజధాని గ్రామాల్లో పర్యటించడం పట్ల టీడీపీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రైతుల కళ్లల్లో చంద్రబాబు కన్నీళ్లు నింపుతున్నారని, తాను ఆ పరిస్థితిని మార్చేస్తానని గురువారం నాడు జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
శుక్రవారం నాడు రాజధాని అమరావతిలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులపై జగన్కు ఏ మాత్రం ప్రేమలేదని, సీఎం చంద్రబాబుపై సంస్కారం లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని సోమిరెడ్డి విరుచుకుపడ్డారు. జగన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ.. జగన్ వయసెంతా?.. ఆయన స్థాయి ఎంత? అని ప్రశ్నించారు.
ఇప్పటికే ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నా.. సిగ్గులేకుండా జగన్ రాజకీయ పర్యటనలు చేస్తున్నారని సోమిరెడ్డి ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు జగన్ కు లేదని మండిపడ్డారు.
ఎమ్మెల్యే అఖిలప్రియపై దాడిని భూమా నాగిరెడ్డి ఖండించారు. ఆమె కారును ఆపి వైసీపీ నేతలు దాడికి దిగడం సరికాదన్నారు. ప్లాన్ ప్రకారమే అఖిలపై దాడిచేశారని ఆరోపించారు. పక్కా సమాచారంతోనే వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అఖిలప్రియ పార్టీ మారిందని కొందరు ప్రశ్నిస్తున్నారని, మరి జగన్ పార్టీ మారలేదా? అని ప్రశ్నించారు. జగన్ కు ఒక న్యాయం, అఖిలప్రియకు ఇంకో న్యాయమా? అని నిలదీశారు. జగన్ ఇప్పటికైనా రౌడీ రాజకీయాలను మానుకోవాలని, అఖిలప్రియపై దాడిని ఆయన ఎలా సమర్థించుకుంటారని సోమిరెడ్డి ప్రశ్నించారు.