సోమిరెడ్డి వర్సెస్ కాకాణి: మంత్రిని బర్తరఫ్ చెయ్యాలి; దళితుడి మృతితో నెల్లూరులో హాట్ పాలిటిక్స్
నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నారాయణ అనే వ్యక్తి మృతి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి కారణమైంది. ఇక తాజా పరిణామాలతో కాకాణి గోవర్ధన్ రెడ్డి వర్సెస్ సోమి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి రచ్చ కొనసాగుతుంది. నారాయణ అనే వ్యక్తి చావుకు కారణమైన ఎస్సై కరీముల్లాని కోర్టు బోను ఎక్కించే దాకా వదిలిపెట్టనని తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టకుండా వైసీపీ సర్కార్ ను టార్గెట్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు టీడీపీ నేతలు. మంత్రి కాకాణిని వెంటనే భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దళితుడు ఉదయగిరి నారాయణ చావుతో నెల్లూరులో రగడ
నారాయణ చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ చలో నెల్లూరుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు టీడీపీ ఛలో నెల్లూరును భగ్నం చేసింది. తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు నెల్లూరు జిల్లాలో ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేశారు. అయినా ఈ చావుపై టీడీపీ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన క్రమంలో నిన్న సోమిరెడ్డి ప్రభుత్వ తీరుపై, పోలీసుల వైఖరిపై నిప్పులు చెరిగారు. ఉదయగిరి నారాయణ ప్రాణాలు తీసిన పొదలకూరు ఎస్సై కరీముల్లాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అతనిని జైలు ఊచలు లెక్క పెట్టించే దాకా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఇక ఈ కేసులో పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మంత్రి దీనికి బాధ్యుడని ఆయనను మంత్రివర్గం నుండి తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులపై, ప్రభుత్వం పై సోమిరెడ్డి ఆగ్రహం
దళితులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించామని పేర్కొన్నారు. ఎస్సై ఆగడాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు ఒక చెయ్యి వేస్తే మా వైపు నుంచి లక్ష చేతులెత్తి గుర్తుంచుకోండి అంటూ హెచ్చరించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ వ్యవహారాన్ని వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఇక కాకాణి గోవర్ధన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పినట్టే పోలీసులు వ్యవహరిస్తున్నారని, నేరం చేసిన వాళ్ళను కాపాడుతున్నారని మండిపడ్డారు. ఆయన మంత్రి అయిన తర్వాత జిల్లాలో అరాచకాలు పెరిగిపోయాయని మండిపడుతున్నారు.
ఇంటి నుండి నెల్లూరు బయలుదేరిన సోమిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు .. మండిపడిన మాజీ మంత్రి
అల్లీపురంలోని ఇంటి నుంచి నెల్లూరులోని టీడీపీ కార్యాలయానికి బయలుదేరిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఈరోజు కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అరెస్ట్ చేస్తే చేసుకోండని పోలీసులకు సవాల్ విసిరారు. తనకు వ్యక్తిగత స్వేఛ్చ లేదా అని ప్రశ్నించారు. ఇది నియంత పాలనకు ఉదాహరణ అంటూ మండిపడ్డారు. తనను ఎక్కడికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను నిలదీశారు.
తనను అరెస్ట్ చెయ్యాలంటూ సవాల్ .. ఉద్రిక్తత
తనను అరెస్ట్ చెయ్యదలచుకుంటే అరెస్ట్ చేసుకోవాలని, లేదంటే తనకు అడ్డు తొలగాలని పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. ఇక ఈ క్రమంలో సోమిరెడ్డి కాలినడకన నెల్లూరుకు బయలుదేరారు. దీంతో సోమిరెడ్డిని ఫాలో అవుతున్న పోలీసులు మేకలవారితోట వద్ద మరోసారి అడ్డుకోవడంతో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నేతలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణం అయిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇక ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టేది లేదని సోమిరెడ్డి చెప్పటంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఇక నేడు కూడా అక్కడ రాజకీయాలు హాట్ హాట్ గానే సాగుతున్నాయి.