చంద్రబాబుతో తెగదెంపులే?: సోము 'వీరా'వేశం, కేంద్రంపై గాలి..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, బిజెపిల మధ్య సంబంధాలు మరింతగా బెడిసికొట్టే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో తెగదెంపులకే కమలనాథులు సిద్ధపడ్డారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి చంద్రబాబుపై గురువారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. సోము వీర్రాజు విమర్శల దాడి చూస్తే ఇరు పార్టీల మధ్య సంబంధాలు బెడిసికొట్టే సూచనలే కనిపిస్తున్నాయి. గురువారంనాడే తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు కేంద్రంపై విమర్శలు చేశారు.

సోము వీర్రాజు ఎందుకలా..
బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీపై వరుసగా విమర్శల జడివాన కురిపిస్తున్నారు. బిజెపి జాతీయ నాయకత్వం అండదండలు లేకపోతే ఆయన అంత తీవ్రంగా చంద్రబాబు ప్రభుత్వంపై, తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయబోరని అంటున్నారు.

సోము వీర్రాజు లాజిక్ లాగుతున్నారు...
చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై మాత్రమే దృష్టి పెడుతున్నారంటూ సోము వీర్రాజు విమర్శిస్తూ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టులను పట్టించుకోరా అని అడుగుతున్నారు. దీన్ని బట్టి చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వెనకబడిన ప్రాంతాల గురించి మాట్లాడడం ద్వారా ఆయా ప్రాంతాల ప్రజల్లోకి చొచ్చుకుపోవాలని బిజెపి ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది.

ఆమిత్ షా ఆమోదంతోనే సోము వీర్రాజు...
బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంతంగా పార్టీని బలోపేతం చేయాలనే వ్యూహంతో ఉన్నారు. అందుకు ఇప్పటి నుంచి కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోము వీర్రాజు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారనే మాట వినిపిస్తోంది. సోము వీర్రాజుకు అమిత్ షా అండదండలున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

కేంద్రంపై గాలి ఇలా..
మనం కడుతున్న డబ్బులో నుంచి కేంద్రం కొంత రాష్ట్రాలకు ఇస్తుందని, భారత్లో మన రాష్ట్రం ఒక భాగమని, మనం కూడా పన్నులు చెల్లిస్తున్నామని, మన దగ్గర కూడా కేంద్రం డబ్బులు తీసుకుంటుందని గాలిముద్దు కృష్ణమ నాయుడు చెప్పారు. ఇది ఒక వ్యక్తి ఎస్టేట్ కాదని, ఇక్కడ అసెంబ్లీ, మంత్రులు, అధికారులు ఉన్నారని ఆయన కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

కేంద్రం మనల్ని నమ్మాల్సిందే..
కేంద్రం పంపిన ఐఎస్ఎస్లు కూడా ఇక్కడ ఉన్నారనిగ గాలి చెప్పారు. కేంద్రం మమ్మల్ని నమ్మాలని,డబ్బులు కూడా విడుదల చేయాలని ఆయన కోరారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు బాగా పని చేస్తున్నారని గాలి ముద్దు కృష్ణమ నాయుడు అన్నారు.

కొంత మంది బిజెపి నాయకులే..
కొంతమంది బీజేపీ నాయకులే రాజకీయం కోసం విమర్శలు చేస్తున్నారని గాలి ఆగ్రహ వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రానికి లెక్కలు చెబుతున్నామని, అయినా ఎప్పటికప్పుడు లెక్కలు చెప్పాలంటే కుదరదని ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెయ్యటం మంచిది కాదని సూచించారు.












Click it and Unblock the Notifications