ఏపీ బీజేపికి కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు..! అసంతృప్తితో వెళ్లిపోయిన సీనియర్ నేత
న్యూఢిల్లీ : గతకొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక దాదాపుగా ఖరారైనట్టు సమాచారం. ముందునుంచి అనుకున్నట్టు గానే రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును పార్టీ అధిష్టానం అధ్యక్షుడిగా నియమించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో సోము వీర్రాజు ఎంపికపై చర్చ జరిగినట్టు సమాచారం.
హద్దులు దాటొద్దు! అదే విషయం చంద్రబాబుకు చెప్తా: అమిత్ షా
అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి కామినేని శ్రీనివాస్ ను అధిష్టానం దూరం పెట్టగా, పార్టీ జాతీయ నేతలు మురళీధర్ రావు, రాం మాధవ్, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర బీజేపీ నేతలు పురందేశ్వరి, మంత్రి మాణిక్యాలరావు, ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా సమావేశానికి హాజరయ్యారు.
సోము వీర్రాజు పేరును రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ చర్చ జరిగినట్టు సమాచారం. ఇంతవరకు అధికారిక ప్రకటనేది బయటకు రాకపోయినప్పటికీ దాదాపుగా ఆయన ఎంపిక ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సోము వీర్రాజు ఎంపిక పట్ల బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత సమావేశం అనంతరం అసంతృప్తితో అక్కడినుంచి వెళ్లిపోయినట్టుగా సమాచారం.
మిత్రపక్షమైనా, తగ్గేది లేదు: చంద్రబాబుకు మోడీ హెచ్చరిక
కాగా, అంతకుముందు జరిగిన ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, నేతలు వెంకయ్య నాయుడు, మురళీధర్ రావు, రాం మాధవ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, ఏపీ మంత్రులు కామినేని, మాణిక్యాలరావు, ఎంపీ గోకరాజు, సోము వీర్రాజు, పురంధేశ్వరీ, కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. సమావేశంలో భాగంగా ఏపీలో పార్టీ బలోపేతం గురించి చర్చించిన నేతలు, అనంతరం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుకు సంబంధించిన ఓ సీడీని అమిత్ షా కు అందజేసినట్టుగా సమాచారం.