పవన్ కళ్యాణ్కు వీర్రాజు కౌంటర్, నరేంద్ర మోడీ వ్యతిరేకం.. వైసిపి ఎంపీ
జల్లికట్టుతో ముడిపెట్టి ప్రత్యేక హోదా పేరుతో ఉద్యమించడం సరికాదని ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు మంగళవారం నాడు అన్నారు.
విజయవాడ: జల్లికట్టుతో ముడిపెట్టి ప్రత్యేక హోదా పేరుతో ఉద్యమించడం సరికాదని ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు మంగళవారం నాడు అన్నారు. 2017 తర్వాత ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఉండదని ఆయన తేల్చి చెప్పారు. జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలిక తెచ్చిన విషయం తెలిసిందే.
కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి సాయం అందుతుందని చెప్పారు. బీజేపీ ఏపీకి అన్యాయం చేయదని అన్నారు. తెలంగాణలో తమ ఫోటోలు వేస్తున్నారని, కానీ ఏపీలో మిత్రపక్షం ఉన్నా ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో వాడటం లేదన్నారు.
మోడీ వ్యతిరేకం కాబట్టే: మేకపాటి
హోదాతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందనే సంగతి సీఎం చంద్రబాబుకు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు బాగా తెలుసని వైసిపి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, వారిద్దరూ ఆయన మాటను అనుసరించి వెళ్తున్నారన్నారు.
అయితే, ప్రధానిని ఒప్పించాల్సిన బాధ్యత కేంద్రంలోని తెలుగు మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఉందని చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సోమవారం జరిగిన అఖిలపక్ష భేటీకి ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్రత్యామ్నాయం లేదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజల్ని హిప్నటైజ్ చేయాలని చంద్రబాబు, కేంద్రమంత్రులు చూస్తున్నారన్నారు. ఎంపీ విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.