మోడీ పేరు: సోము వీర్రాజు డిమాండ్కు టీడీపీ తలొగ్గుతుందా?
అమరావతి: సోము వీర్రాజు... ఇటీవల కాలంలో ఏపీలోని బీజేపీ పార్టీలో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు. ఏపీ బీజేపీలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎవరైనా ఘాటు వ్యాఖ్యలు చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే అది సోము వీర్రాజు మాత్రమే. మంగళవారం శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులకు ప్రధాని నరేంద్ర మోడీ పేరు పెట్టే విషయాన్ని పరిశీలించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
వివరాల్లోకి వెళితే.. మంగళవారం మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పత్తిపాటి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో కరువు నివారణకు, పంటలకు సాగునీటిని అందించేందుకు జాతీయ పథకమైన ఎంజీఎన్ఆర్ఈఎస్ కింద (2015-16) సంవత్సరానికి గాను రూ. 3,197.60 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ నిధులతో ఏపీలోని పలు గ్రామాల్లో నీటి కుంటలను తవ్వించినట్లు ఆయన చెప్తుండగా... మంత్రి ప్రసంగంలో మధ్యలో కలగజేసుకున్న సోము వీర్రాజు ఏపీలో సంక్షేమ పథకాలకు 'చంద్రన్న బాట', 'చంద్రన్న కానుక' వంటి పేర్లు మాత్రమే పెడుతున్నారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే పనులకు ప్రధాని మోడీ పేరును ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. దీనిపై మంత్రి పుల్లారావు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ మొత్తం వ్వవహారం చూస్తుంటే ఏపీలో బీజేపీ తన బలాన్ని పుంజుకోవడానికి అవసరమైన అన్ని మార్గాలను తనకు అనుకూలంగా మలచుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ మిత్రపక్షంగా ఉన్నాయి. ఏపీలో కొన్ని పథకాలకు మోడీ పేరు పెట్టాలని సోము వీర్రాజు చేసిన డిమాండ్ బాగానే ఉంది కానీ, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు బీజేపీ ఏం చేసిందో చెప్తే బాగుంటుందని అంటున్నారు. ఈ విషయంలో సోము వీర్రాజు మోడీ పట్ల తన స్వామిభక్తిని ప్రదర్శించారని అంటున్నారు.
ఇటీవల కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జేట్లో కూడా ఏపీకి మొండి చెయ్యి చూపించింది. బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించకపోవడంపై సీఎం చంద్రబాబు సైతం అసంతృప్తిన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో సోము వీర్రాజు... మోడీ పేరు పెట్టమని అడగటం ఎంత వరకు సబబు అంటున్నారు.
అలా కాకుండా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించి లేదంటే రాష్ట్ర ఆర్ధిక అవసరాలకు అనుగుణంగా భారీగా నిధులు విడుదల చేసి ఉంటే సోము వీర్రాజు డిమాండ్లో న్యాయం ఉండేదని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సైతం కేంద్రం పెద్దగా నిధులిచ్చిన పాపాన పోలేదు. లేదంటే పోలవరం ప్రాజెక్టుకు ప్రధాని మోడీ పేరు పెట్టొచ్చు.
రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ నిధుల ప్రకటన చేస్తారని అనుకుంటే చెంబుడు నీళ్లు, కుండలో మట్టి మాత్రమే ఇచ్చి వెళ్లారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు చేసిన సూచన ఏ మేరకు పనిచేస్తుందో చూద్దాం. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ప్రతిష్టాత్మకమైన కొన్ని జాతీయ సంస్ధల నెలకొల్పామని బీజేపీ నేతలు చెబుతుంటే అవన్నీ కూడా విభజన చట్టం హామీలో ఉన్నవే కదా? అని టీడీపీ నేతలు చెబుతున్నారు.
నిజానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు మీడియా మేనేజ్మెంట్ బాగా చేస్తారని పేరు. కాగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రారంభించిన కొన్ని పథకాలకు స్వర్గీయ ఎన్టీఆర్ పేరు పెట్టగా, మరికొన్ని పథకాలకు ('చంద్రన్న బాట', 'చంద్రన్న కానుక') మాత్రం ఆయన పేరు పెట్టుకున్నారు.