భద్రాద్రి ఏపీ సొత్తే, తిరిగి తేగలరా?: వీర్రాజు, ఏపీలో బీజేపీ బలోపేతంపై
భద్రాద్రి రామయ్య ముమ్మాటికీ ఏపీ సొత్తేనని, స్వామిని అప్పనంగా తెలంగాణకు అప్పగించారని బిజెపి శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు శనివారం నాడు వ్యాఖ్యానించారు.
అమరావతి: భద్రాద్రి రామయ్య ముమ్మాటికీ ఏపీ సొత్తేనని, స్వామిని అప్పనంగా తెలంగాణకు అప్పగించారని బిజెపి శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు శనివారం నాడు వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ వైఖరి కారణంగానే భద్రాచలం తెలంగాణకు వెళ్లిపోయిందని, ఇప్పుడు రాముడిని తిరిగి ఏపీకి తీసుకురాగలరా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రాచల రాముడిని తెలంగాణకు ఇచ్చి, ఏపీ వాసులకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందన్నారు. బిజెపి ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రాయలసీమ కోసం దుమ్ముగూడెం ప్రాజెక్టును వైయస్ రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తే, దానిని కూడా కేసీఆర్ ప్రభుత్వానికి అప్పగించారన్నారు. ఏపీలోని మూడు మండలాలు తెలంగాణకు అప్పగించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు.
ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాలతో పోలిస్తే మరిన్ని నిధులను ఏపీకి కేంద్రం ఇచ్చిందని, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులతో పాటు ఏపీకి అదనంగా రూ. 42 వేల కోట్ల నిధులు ఇచ్చామని చెప్పారు. హోదా ముగిసిన అధ్యాయం అన్నారు. మోడీ నాయకత్వం, అమిత్ షా వ్యూహాలు బిజెపిని బలోపేతంచేస్తాయన్నారు.
భద్రాద్రికి కొత్త సొబగులు: ఆలయ కొత్త నమూనాలు అద్భుతం(పిక్చర్స్)
ఏపీని నిట్టనులువు చీల్చిన కాంగ్రెస్ మళీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని సభలు నిర్వహించటం దారుణమని వీర్రాజు అన్నారు. ప్రధాన మోడీ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేస్తున్నారన్నారు.
2019 నాటికి రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసేందుకు కార్యశాలలు నిర్వహిస్తున్నామని సోము వీర్రాజు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా 42వేల పోలింగ్బూత్ కమిటీలు ఉన్నాయని వాటి 26వేల బూత్స్థాయి కమిటీలను నియమించినట్లు తెలిపారు.