సినిమా టికెట్ల ధరలు తగ్గించి ప్రగల్భాలా జగన్; ఇకపై చెడుగుడే సోము వీర్రాజు వార్నింగ్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీలో జగన్ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన కర్నూలు యువజన విభాగం అధ్యక్షుడిని హత్య చేస్తామని బెదిరింపు ఫోన్లు వచ్చాయని సోము వీర్రాజు పేర్కొన్నారు. తమ పార్టీ జిల్లా అధ్యక్షుడిపైన హత్యాయత్నం చేసే పరిస్థితిని కూడా తీసుకొచ్చారని సోము వీర్రాజు మండిపడ్డారు. ఇళ్ల మధ్య మసీదు నిర్మాణం పై ప్రశ్నించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పై 307 సెక్షన్ కింద కేసు ఎలా పెడతారు అంటూ సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు, ప్రభుత్వానికి కళ్ళు పోయాయా అంటూ ప్రశ్నించిన సోము వీర్రాజు జగన్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.
Recommended Video
ఆత్మకూరు ఘటనపై సోము వీర్రాజు మరోమారు ఫైర్
ఆత్మకూరు ఘటనపై మరోసారి మండిపడిన సోము వీర్రాజు ఆత్మకూరు లో 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో కూడా అధికార పార్టీకి చెందిన నేతలు ఎలా పర్యటిస్తున్నారో చెప్పాలని జగన్ ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రాలను సంధించారు. ఆత్మకూరు ఘటనపై పోలీసులు కూడా అబద్ధాలు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిజెపి జిల్లా అధ్యక్షుడిపై దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుంటే తాము ఆత్మకూరు వెళతామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఆత్మకూరు ఘటనలో ప్రధాన ముద్దాయి స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అంటూ సోము వీర్రాజు ఆరోపణలు గుప్పించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ఇసుక ఉచితం, సిమెంట్ బస్తాల ధరలు తగ్గింపు
ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇసుకను ఉచితంగా ఇస్తామని, బస్తా సిమెంటు 220 రూపాయలకే అందిస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే 40 రూపాయలకే బియ్యం ఇస్తామని సోము వీర్రాజు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోకుంటే తాము రాష్ట్ర ప్రభుత్వంతో చెడుగుడు ఆడతామని సోము వీర్రాజు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదంపై మండిపడిన సోము వీర్రాజు రాంగోపాల్ వర్మ ని పిలిచి భోజనం పెట్టారు కానీ విద్యార్థుల కడుపు నింపే విషయాన్ని మాత్రమే ఈ ప్రభుత్వం పట్టించుకోదు అంటూ మండిపడ్డారు.
సినిమా టికెట్ల బదులు ఇసుక, సిమెంట్ ధరలు తగ్గించొచ్చుకదా .. సోము వీర్రాజు
సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వ ఆలోచన ఏంటో అర్థం కావడం లేదన్న సోము వీర్రాజు సినిమా టికెట్ ధరలు తగ్గించి గొప్పగా చెప్పుకోవడం విచిత్రంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. సినిమా టికెట్ల ధరలు తగ్గించమని చెబుతున్న ప్రభుత్వం ఇసుక ధరలను తగ్గించవచ్చు కదా అంటూ ప్రశ్నించారు.
ఇళ్ల నిర్మాణానికి ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారో చూడాలని వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇసుక, సిమెంట్ వారికి తక్కువ ధరలో ఇవ్వొచ్చు కదా అంటూ సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రజలపై జగన్ కు ప్రేమ ఉంటే జగన్ కు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే సిమెంట్ బస్తాల ధరలు తగ్గించవచ్చు కదా అంటూ సోము వీర్రాజు ప్రశ్నించారు.
దమ్ముంటే వరి ధాన్యాన్ని క్వింటాలుకు 1,400 రూపాయలకు కొనుగోలు చేయాలని సవాల్
ధాన్యం కొనేవాడు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అయినా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడిన సోము వీర్రాజు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే వరి ధాన్యాన్ని క్వింటాలుకు 1,400 రూపాయలకు కొనుగోలు చేయాలని సవాల్ విసిరారు. సామాన్యుల మీద అధిక ప్రభావం పడుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఇసుక, సిమెంటు, నిత్యవసర వస్తువుల ధరలు ప్రజలకు అవసరం లేనివని భావిస్తున్నారా? అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిని సోము వీర్రాజు నిలదీశారు.
వేల మంది చూసే సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తారు కానీ 2 కోట్ల మంది గురించి ఆలోచించరా?
రెండు కోట్ల మంది ప్రజల గురించి ఆలోచించరా అంటూ ప్రశ్నించారు. కానీ వేల మంది చూసే సినిమా టికెట్లు తగ్గించి గొప్ప పని చేసినట్లు ప్రగల్భాలా అంటూ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ధరల గురించి మాట్లాడరా అంటూ మండిపడ్డారు. సినిమా టికెట్ల విషయంలో కనీసం సిగ్గులేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు.