ఓ తండ్రి కన్నీటి గాధ: కూతురు పుట్టిన కొద్దిసేపటికే కొడుకు చనిపోయాడు
అమరావతి: నెల్లూరులో విషాదం చోటు చేసుకుంది. కూతురికి జన్మనిచ్చిన ఓ తల్లికి కొన్ని గంటలు గడవక ముందే కన్నకొడుకు మృతి చెందాడు. ఈ విషాధ ఘటన నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...
సుబ్బారెడ్డిపాలెంకు చెందిన పాకాల రాజా ఆటో నడుపుకుని జీవిస్తుండాటు. శనివారం భార్య లక్ష్మి నెల్లూరులో ఆడపిల్లను ప్రసవించిందని తెలిసి చూచేందుకు వెళ్లాడు. పుట్టిన పసిబిడ్డను కళ్లారా చూసుకొని ఆనందంగా ఆదివారం ఉదయం సొంత ఆటోలో సుబ్బారెడ్డిపాలెంకు బయలుదేరాడు.
ఈ క్రమంలో ముత్తుకూరు సమీపంలోని మద్దినూరు సెంటర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ రాజా తీవ్రంగా గాయపడగా, ముందు సీటులో కూర్చున్న అతడి నాలుగేళ్ల కుమారుడు సంతోష్ తలకు తీవ్ర గాయం అవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మరికొద్ది నిమిషాల్లో ఇంటికి చేరతారనే లోగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న రాజా బంధువులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూతురు పుట్టిందన్న ఆనందాన్ని కొన్ని గంటలైనా మిగల్చకుండానే కొడుకు మృతి చెందడం ఆ కుటుంబం విషాదంలో ముగినిపోయింది.
సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న ముత్తుకూరు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంతోష్ మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.