జగన్ సమైక్య సభకు సోనియా డైరెక్షన్: గాలి
హైదరాబాద్: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ దర్శకత్వంలోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సభ జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని అధికారం కోసం జగన్ పాకులాడారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
అన్ని పార్టీలు సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం జన సమీకరణ చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వరదల్లో జనాలు చనిపోయి పంటలు కోల్పోతే జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు.

హైదరాబాదులో ఎపిఎన్జీవోల సభను వ్యతిరేకించిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జగన్ సభ గురించి పట్టించుకోవద్దంటూ పార్టీ శ్రేణులను ఆదేశించడంలో ఆంతర్యమేమిటని ఆయన అడిగారు. కాంగ్రెసు, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు కుమ్మక్కయ్యాయని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఇదిలావుంటే, వైయస్ జగన్ రాజకీయ నాయకుడు కాడని, అవినీతిపరుడని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. కెసిఆర్కు తెలంగాణ రావడం ఇష్టం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications