అమరావతి ఆందోళనలపై పీఎంఓ ఆరా: నిఘా నివేదికలు సైతం: ప్రధాని ఫొటోలపైనా..!
ఏపీలో రాజధాని మార్పు అంశం..అమరావతిలో కొనసాగుతున్న ఆందోళనల పైన ప్రధాని కార్యాలయం ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర నిఘా సంస్థలతో పాటుగా ప్రత్యేకంగా కొందరు కేంద్ర సర్వీసులకు చెందిన అధికారుల నుండి సమాచారం సేకరిస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయంగానూ కొందరు పార్టీ సీనియర్లు ఇప్పటికే కేంద్రానికి ఇక్కడి పరిస్థితులపైన సమాచారం ఇచ్చినట్లుగా సమాచారం. ఇక, నిరసనల్లో రైతులు..మహిళలు ప్రధాని మోదీ ఫొటోలు పట్టుకొని ఆందోళన చేస్తున్న అంశం పైన సమాచారం తెప్పించికున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అమరావతిలో కొనసాగుతున్న నిరసనల పైన ఫోకస్ చేసింది. అక్కడి రైతులను ఏ విధంగా శాంతపరచాలనే అంశం పైన చర్చలు చేస్తున్నట్లు సమాచారం.
అమరావతి ఆందోళనలపై ఆరా..
రాజధాని పైన ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన వ్యాఖ్యలు..జీఎన్ రావు కమిటీ సిఫార్సులతో అమరావతి రైతులు ఆందోళనలు ప్రారంభించారు. స్థానికులు..రైతులు కుటుంబ సభ్యులతో సహా రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయటం పైన ప్రధాని కార్యాలయం ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఏపీలో ఎంచుకున్న కొందరు కేంద్ర సర్వీసు అధికారుల నుండి ఈ సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
నిరసన తీవ్రత అంచనా
ప్రధానంగా మహిళల సంఖ్య నిరసనల్లో ఎక్కువగా ఉండటంతో అసలు ఏం జరుగుతోందని తెలుసుకొనే ప్రయత్నం చేస్తోంది. నిరసన తీవ్రతను అంచనా వేస్తోంది. ఇదే సమయంలో అమరావతితో పాటుగా అటు ఉత్తరాంధ్రలో..ఇటు రాయలసీమలోని ప్రజాభిప్రాయం ఎలా ఉందనే అంశం పైన క్షేత్ర స్థాయి నుండి సమాచారం తెప్పించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
నిఘా వర్గాల ప్రత్యేక ఫోకస్..
ఏపీలో రాజధాని కలకలం పైన కేంద్ర నిఘా వర్గాలు ఫోకస్ పెట్టాయి. ప్రభుత్వ ఆలోచనపైన రాజకీయ పార్టీల స్పందన..ప్రజాభిప్రాయం ఏ రకంగా ఉందనే తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజల నిరసన తీవ్రతను అంచనా వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. విశాఖ.. కర్నూలు.. అమరావతిల్లో రాజకీయ పరిస్థితులు.. ప్రజల స్పందనలు.. ప్రత్యేకించి ఆర్థిక.. వాణిజ్య రంగాలపై ప్రభావం.. శాంతిభద్రతలు వంటి అంశాలపై ఐబీ రోజువారీగా కేంద్రానికి నివేదికలు ఇస్తోంది. ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రతిపాదనల పైన రాజకీయ పార్టీల స్పందన.. అందునా అమరావతి పరిధిలో పెట్టుబడులు..నిర్మాణాల పరిస్థితి పైనా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రధాని ఫొటోలు..బీజేపీ నేతల పైనా
అమరావతిలో సాగుతున్న ఆందోళనల్లో అనేక మంది ప్రధాని మోదీ ఫొటో పెట్టుకొని ఆందోళన చేయటం పైన ప్రత్యేకంగా సమాచారం సేకరిస్తున్నారు. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ అనేక మంది ప్రముఖు ల సమక్షంలో నాడు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసారు. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ రాజధాని మార్పు పైన కసరత్తు చేస్తోంది. దీంతో..అక్కడి స్థానికులు ప్రధాని జోక్యం కోరుతూ మోదీ ఫొటోలతో నిరసనల్లో పాల్గొంటున్నారు.
నిఘా వర్గాల సమాచారం
అదే విధంగా..ఏపీలోని మూడు రీజియన్ల బీజేపీ నేతల అభిప్రాయాలు..వారి వైఖరి.. తాజాగా అమరావతి నిరసనల్లో పాల్గొన్న బీజేపీ నేతల గురించి సైతం నిఘా వర్గాలు కేంద్రానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి..రెండు రోజుల్లోనే స్థానిక బీజేపీ నాయకత్వం కేంద్ర పెద్దలతో సంప్రదింపులు చేయనున్నట్లు సమాచారం.