సంక్రాంతికి ఆంధ్రా వస్తున్నారా ? ఈ బంపర్ న్యూస్ మీ కోసమే..!
ప్రతీ ఏటా సంక్రాంతికి తెలంగాణ నుంచి ఏపీకి భారీగా రద్దీ ఉంటుంది. అలాగే పండుగ ముగిశాక తిరిగి ఏపీ నుంచి తెలంగాణకు రద్దీ పెరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు, నగరాలకు ప్రయాణాలు చేసే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. దీంతో ఇప్పటికే రైల్వేశాఖతో పాటు ఆర్టీసీలు కూడా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి. ఇదే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు వీలుగా ఇవాళ మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
హైదరాబాద్ లోని కాచిగూడ, చర్లపల్లి స్టేషన్ల నుంచి ఏపీలోని శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కు ఈ నాలుగు ప్రత్యేక రైళ్లు పరుగులు తీయబోతున్నాయి. సంక్రాంతి సందర్భంగా కాచిగూడ నుంచి శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కు, అలాగే చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కు ఈ రైళ్లు ప్రయాణం చేస్తాయి. అలాగే తిరుగు ప్రయాణాలు కూడా చేసేందుకు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన తేదీలు, ఇతర వివరాలను దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది. కాచిగూడ-శ్రీకాకుళం సర్వీసుల్లో కేవలం 3ఏసీ బెర్తులు మాత్రమే ఉంటాయి. చర్లపల్లి-శ్రీకాకుళం సర్వీసుల్లో మాత్రం అన్ని కోచ్ లు ఉంటాయి.

దీని ప్రకారం ముందుగా ఈ నెల 8వ తేదీన చర్లపల్లి నుంచి ఏపీలోని శ్రీకాకుళం స్టేషన్ కు ఓ ప్రత్యేక రైలు నడుపుతారు. ఇది సాయంత్రం 7.20కి చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం చేరుతుంది. అలాగే 9వతేదీన శ్రీకాకుళం రోడ్ స్టేషన్ లో మధ్యాహ్నం 2.45కు బయలుదేరి తర్వాతి రోజు చర్లపల్లికి ఉదయం 6.30కి చేరుకోనుంది. అలాగే ఈ నెల 14, 15 తేదీల్లో కాచికూడ-శ్రీకాకుళం స్టేషన్లకు మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
ఈ రెండు ప్రత్యేక రైళ్లు కూడా కాచిగూడలో సాయంత్రం 5.45కి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటాయి. అలాగే ఈనెల 12, 16 తేదీల్లో శ్రీకాకుళంలో మధ్యాహ్నం 2.45కు బయలుదేరే రెండు రైళ్లు కూడా మరుసటి రోజు ఉదయం 7.35కి కాచికూడ చేరుకుంటాయి. కాచిగూడ,చర్లపల్లి నుంచి బయలుదేరే రైళ్లు.. మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురు పల్లి, పొందూరు స్టేషన్లలో ఆగుతాయి.












Click it and Unblock the Notifications