ఒక్కటి చెప్పండి: దిగ్విజయ్కి ఫోన్ చేసి నిలదీసిన కిరణ్!
మీరు, షిండేలు విభజనపై రెండు రకాలుగా మాట్లాడటం ఇరు ప్రాంతాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందని డిగ్గీని కిరణ్ ఆక్షేపించారు.
తీర్మానం అసెంబ్లీకి రెండుసార్లు వస్తుందని మీ మాటగా ఎపిఎన్జీవోలకు చెప్పాలని చర్చల సమయంలో నాతో చెప్పారని, అదే మాటను వారికి తాను చెప్పానని, ఇప్పుడు షిండే మాత్రం డ్రాఫ్ట్ బిల్లు మాత్రమే వస్తుందని విభజన తర్వాత పూర్తి చేస్తామని అంటున్నారని ఇదేమిటని డిగ్గీని ప్రశ్నించారు.
తీర్మానం రెండుసార్లు అసెంబ్లీకి వస్తుందని ఉద్యోగ సంఘాలకు నచ్చచెప్పిన సమయంలో విరుద్ధ ప్రకటనలు సరికాదని చెప్పారు. తీర్మానం పైన రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన డిగ్గీతో అభిప్రాయపడ్డారు. పార్టీ, ప్రభుత్వ ప్రకటనలు వేర్వేరుగా ఉండటం సరికాదని చెప్పారు. ఏది వాస్తవమో చెప్పాలని అడిగారు.
డిగ్గీ వివరణ
వేర్వేరు ప్రకటనలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనను అడగడంతో దిగ్విజయ్ సింగ్ దానికి స్పందించారు. తాను ప్రస్తుతం మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్నానని, ఢిల్లీకి వెళ్లాక షిండేతో మాట్లాడిన తర్వాత తాను చెబుతానని ముఖ్యమంత్రిని సముదాయించినట్లుగా తెలుస్తోంది.