సభలో చిడతలు వాయించిన టీడీపీ సభ్యులు - స్పీకర్ సీరియస్ : మంత్రి నాని ఫైర్..!!
ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జంగారెడ్డి గూడెంలో వరుస మరణాల పైన టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగిస్తున్నారు. దాదాపు వారం రోజులుగా నిత్యం టీడీపీ సభ్యులు సభ నుంచి సస్పెండ్ అవుతున్నారు. ఈ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో మరోసారి టీడీపీ సభ్యులు ఆందోళన ప్రారంభించారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేసారు. స్పీకర్ వారించినా వారు వెనక్కు తగ్గలేదు. ఆ సమయంలో టీడీపీ సభ్యులు సభలో చిడతలు వాయించారు. దీనిని స్పీకర్ సీరియస్ గా తీసుకున్నారు.
అసలు సభ లోకి చిడతలు తీసుకురావటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసారు. మంగళవారం ఈలలు వేయటం .. ఈ రోజు చిడతలు వాయించటం ద్వారా సభ గౌరవాన్ని కించ పరుస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. స్పీకర్ పోడియం చరుస్తూ నినాదాలు చేసారు. టీడీపీ సభ్యుల తీరుపైన వైసీపీ సభ్యులు ఫైర్ అయ్యారు. మంత్రి కొడాలి నాని టీడీపీ సభ్యులు సస్పెండ్ అయి రావాలంటూ చంద్రబాబు చెప్పి పంపారని..వారు సస్పెండ్ చేయించుకోవటానికే ఇలా వ్యవహరిస్తున్నారంటూ కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం ప్రకటిస్తే..చంద్రబాబు దానిని రద్దు చేసారని గుర్తు చేసారు.
చీపు లిక్కర్ - కల్తీ మద్యం తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే అని ఫైర్ అయ్యారు. టీడీపీ సొంతంగా గెలవలేక.. ఇతర పార్టీల పైన ఆధార పడుతోందని..వీళ్లను నమ్ముకుంటే వాళ్లు కూడా మునిగిపోతారంటూ నాని వ్యాఖ్యానించారదు. టీడీపీ ఎమ్మెల్యేలు తమ నేతను అయినా మార్చుకోవాలి..లేదా వీరైనా మారాలని సూచించారు. సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ సభ్యుల తీరును తప్పు బట్టారు. నిన్న విజిల్స్.. నేడు చిడతలు.. రేపు ఏం చేస్తారో అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ సభ్యులు ఎన్నికల తరువాత చిడతలే వాయించుకోవాలంటూ పేర్కొన్నారు.