అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ - వైసీపీ సభ్యుల డిమాండ్...!!
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు మరోసారి సస్పెండ్ అయ్యారు. సభలో కార్యక్రమాల నిర్వహణకు అడ్డుపడుతున్నారంటూ ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సస్పెన్షన్ తీర్మానం ప్రదిపాదించారు. స్పీకర్ వారిని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. టీడీపీ ఈ ఉదయం సభ ప్రారంభం సమయంలో రైతు సమస్యల పైన వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిని ప్రశ్నోత్తరాల తరువాత స్పీకర్ తిరస్కరించారు.
ఉదయం వైసీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా టీడీపీ, తెలుగు రైతు ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఎడ్లబండి కాడె మోస్తూ అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అయితే, తెలుగుదేశం నిరసనకు ఎడ్ల బండి ఇచ్చిన రైతును సీఐ తీవ్రంగా కొట్టారంటూ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.
రైతుని కొట్టిన అంశంపై అసెంబ్లీలో నూ నిరసన తెలుపుతామన్నారు. సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పోలవరం పైన వాదోపవాదనలు సాగాయి. ముఖ్యమంత్రి జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమాధానం ఇచ్చారు. ఆ తరువాత డిప్యూటీ స్పీకర్ గా కొలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నిక కావటంతో..ప్రభుత్వం -అధికార పక్షం గౌరవంగా ఆయన్ను సీటు వద్దకు తీసుకొచ్చారు.
ముఖ్యమంత్రి జగన్.. మంత్రులు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్వామికి అవకాశం దక్కటం పట్ల మాట్లాడారు. ఆ తరువాత సభ ప్రారంభమైన సమయం నుంచి రైతులపైన పోలీసులు కేసులు పెట్టటం..కొట్టటం ఏంటని టీడీపీ ఆందోళనకు దిగింది. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో సభలో అడ్గు తగిలారు.
దీంతో..మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసారు. చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నా.. టీడీపీ సభ్యులు బయటకు వెళ్లాలని డిసైడ్ అయ్యే ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో.. వెంటనే ప్రభుత్వం టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తీర్మానం చేసారు. ప్రస్తుత సమావేశాలు జరిగిన రెండు రోజులు..నేడు వరుసగా టీడీపీ సభ్యుల పైన సస్పెన్షన్ వేటు పడింది. ఆ తరువాత కూడా సభలో టీడీపీ సభ్యుల తీరు పైన చర్చ జరిగింది. వారి పైన పూర్తిగా సస్పెన్షన్ వేటు వేయాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేసారు.