తేలని ఏపీ పరిషత్ పంచాయతీ-మరో ఆరునెలలు ప్రత్యేకాధికారుల పాలనే
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారం పలు సమస్యలకు కారణమవుతోంది. ఎన్నికలు జరిగినా ఫలితాలపై హైకోర్టు తుది నిర్ణయం పెండింగ్ లో ఉండటంతో స్ధానిక సంస్ధల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు వీల్లేకుండా పోయింది. అదే సమయంలో ఇప్పటికే కొనసాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనను సైతం పొడిగించాల్సిన పరిస్ధితి ఏర్పడింది.
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ తర్వాత ఫలితాల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనతో మండల, జిల్లా పరిషత్ లలో పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో ప్రభుత్వం ఇప్పటికే కొనసాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనను మరో ఆరునెలల పాటు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు వరుసగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింపుపై స్ధానికంగా ఉన్న నేతలు, తాజాగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం గత ఏడాదిగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తొలుత కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడగా.. ఆ తర్వాత కరోనా తగ్గిన తర్వాత ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఏకగ్రీవాలపై విపక్షాలు న్యాయపోరాటనికి దిగడంతో ఎన్నికల నిర్వహణ చేపట్టలేనంటూ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ చేతులెత్తేశారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నీ వచ్చీ రాగానే ఎన్నికలకు నోటిపికేషన్ ఇవ్వడం, వారం రోజుల్లో ఎన్నికలు నిర్వహించడం చకచకా జరిగిపోయా.యి. దీంతో ఆమె సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వం చేసిన అప్పీలు హైకోర్టు డివిజన్ బెంచ్ లో పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో చేసేది లేక ప్రభుత్వం ప్రత్యేకాధికారుల పాలన పొడిగించింది.