చిప్ప చేతికి, పిండాకూడులా: ప్యాకేజీపై బాబుకు శివాజీ హెచ్చరిక
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా రాదని, కేంద్రం ప్రత్యేక ప్యాకేజీయే ప్రకటించేందుకు సిద్ధంగా ఉందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధనా సమితి గౌరవ అధ్యక్షులు శివాజీ బుధవారం నాడు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు.
కేంద్రం ప్యాకేజీ ఇస్తానని చెప్పాక, దానికి సరేనంటే భారీ నష్టం తప్పదని చంద్రబాబును హెచ్చరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేస్తే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి చిప్ప చేతికి వస్తుందన్నారు.
విశాఖ రైల్వే జోన్తో లాభాలు వస్తాయని చెప్పారు. విజయవాడలో జోన్ ఏర్పాటు చేస్తే గొడవలు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు. కేంద్రం ఇస్తానని చెబుతున్న ప్యాకేజీ పిండాకూడులా ఉందని ధ్వజమెత్తారు.
రాజధాని అమరావతికి ఇచ్చే రూ.2,500 కోట్లు రోడ్లకు కూడా సరిపోవన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని అడిగితే, బ్యాంకు లోన్లు ఇస్తామని అనడం చిప్ప చేతికివ్వడమే అని ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు చిక్కు
విశాఖను రైల్వే జోన్ చేయకుండా విజయవాడను రైల్వే జోన్గా చేస్తే చంద్రబాబుకు చిక్కులేనని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అమరావతి పైనే దృష్టి సారించిందనే విమర్శలు ఉన్నాయి. సీమను పట్టించుకోవడం లేదని కొందరు అంటున్నారు.
అలాగే ఉత్తరాంధ్ర పరిస్థితి. ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ బెజవాడకు వెళ్తే.. బాబుకు చిక్కులే అంటున్నారు. విభజన నేపథ్యంలో హైదరాబాద్ ప్రభావం కారణంగా అభివృద్ధి వికేంద్రీకరణకు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రం ప్రకటనపై ఏపీ ప్రజల ఉత్కంఠ
ఏపీకి భారీ ప్యాకేజీ పైన కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులు ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం ప్రకటన చేసే అవకాశాలున్నాయి. కొన్ని అంశాల పైన స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. వాటి పైన స్పష్టత వచ్చాక ప్రకటన చేయనున్నారని అంటున్నారు. ప్యాకేజీ విషయమై ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.