కాంగ్రెసులో ఎపికి ప్రత్యేక హోదా చిచ్చు: గుత్తాకు పొన్నం బాసట
కరీంనగర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తూ తమ పార్టీ తెలంగాణ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖకు కాంగ్రెసు తెలంగాణ మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ నుంచి మద్దతు లభించింది. దీంతో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి రాసిన లేఖతో కాంగ్రెస్ పార్టీలో మొదలైన వివాదం మరింత ముదిరింది. దీనిపై సుఖేందర్రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టమని, ఈ విషయమై పునరాలోచించాలని గుత్తా ప్రధానికి లేఖ రాశారు. అయితే గుత్తా తీరుపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీ జాతీయ నాయకుడు జైరాం రమేష్ కూడా గుత్తాను మందలించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం గుత్తా సుఖేందర్ రెడ్డి రాసిన లేఖపై తప్పు పట్టాల్సిన పని లేదని తాజాగా పొన్నం ప్రభాకర్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు ఇవ్వాల్సిందేనని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
అయితే దీనిపై బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చద్రశేఖర రావుదేనని ఆయన అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే తపన కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో లేదని పొన్నం విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై జరుగుతున్న జాప్యాన్ని ఆసరా చేసుకుని అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేయాలనే కాంగ్రెసు అధిష్టానానికి తెలంగాణ నేతల నుంచి చిక్కులు ఎదురవుతున్నాయని దీన్ని బట్టి అర్థమవుతోంది.
రేవులు, పరిశ్రమలు, ఇతరత్రా సౌకర్యాలకు దూరంగా ఉన్న, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తారని, హిమాలయ రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాలే దీనికి అర్హమైనవని, కానీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తగదని, అంతర్జాతీయ సరిహద్దు ఉన్న, వెనుకబడిన రాష్ట్రమైన బీహార్కు విభజన తర్వాత కూడా కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటించలేదని గుత్తా తన లేఖలో అన్నారు.