ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చేసిన జైట్లీ: సుజనా, జెసి చెరో మాట
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను 14 ఆర్థిక సంఘం సిఫారసు చేయలేదని, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు మంగళవారం కేంద్రమంత్రి అరుణ్జైట్లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలతో ఆయన మాట్లాడారు.
విభజనతో ఏపీకి ఆర్థికంగా నష్టం జరిగిందని, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏపీకి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి రాలేమని గ్రహించిన కాంగ్రెస్ ఇష్టారీతిన హామీలు గుప్పించిందని జైట్లీ ఆరోపించారు. రాజకీయ కారణాలతోనే ప్రత్యేకహోదాపై ఆందోళనలు చేస్తున్నారని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు చెప్పే మాటల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని మంగళవారం సాయంత్రం టిడిపి పార్లమెంటు సభ్యులు కలిశారు. ఈ భేటీ తర్వాత వారు మీడియాతో మాట్లాడిన సమయంలో ఆ తేడా స్పష్టంగా కనిపించింది.
ప్రత్యేక హోదాపై ఇంకా ఆశలు ఉన్నాయనే పద్ధతిలో కేంద్ర మంత్రి, టిడిపి పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి అంటే, ఆ విషయంలో సాంకేతిక సమస్యలున్నాయని అరుణ్ జైట్లీ చెప్పారని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా రాదని జెసి దివాకర్ రెడ్డి మొదటి నుంచీ కుండ బద్దలు కొట్టినట్లే చెబుతున్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వడానికి న్యాయపరమైన సాంకేతిక సమస్యలనున్నాయని అరుణ్ జైట్లీ చెప్పినట్లు టిడిపి పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాకుండా రాయితీలు, నిధులు ఇస్తామని జైట్లీ చెప్పినట్లు జెసి తెలిపారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే రాయితీలు, ప్రోత్సాహకాల కన్నా ఎక్కువగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని జైట్లీ చెప్పినట్లు ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ను, అరుణ్ జైట్లీని కలిసిన తర్వాత పరిస్థితి ఆశాజనకంగా కనిపించిందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా అనే పదం ఉంటుందో తెలియదు గానీ ప్రయోజనాలు మాత్రం అంతకన్నా ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు.
కాగా, ప్రత్యేక హోదా వేరు, ఆర్థిక ప్యాకేజీ వేరు అని కేంద్ర మంత్రి, టిడిపి పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. పది రోజుల్లో ప్రత్యేక ప్యాకేజీ అందుతుందని భావిస్తున్నామని ఆయన అన్నారు. పరిశ్రమలకు ప్యాకేజీ పెంచాలని తాము కోరినట్లు ఆయన తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఏ విధంగా ఇవ్వాలనే అంశంపై కేంద్రం కసరత్తు చేస్తోందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. మరో పది రోజుల్లో దీనిపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడనుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ప్రతిపాదనలు అందజేస్తామని తెలిపారు
ఇదిలావుంటే, ప్రత్యేక హోదా కన్నా రెట్టింపు స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని బిజెపి పార్లమెంటు సభ్యుడు కంభంపాటి హరిబాబు చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా లేదా ప్రత్యేక ప్యాకేజి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. పేరు ఏదైనా ఇచ్చిన హామీ కంటే పదిశాతం ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు.