అనుకున్నది సాధించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు గట్టిగా పట్టుబట్టి అనుకున్నది సాధించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు, వైజాగ్ నుంచి కొల్లం వరకు రైలును నడపాలన్న ఎంపీ అభ్యర్థనను ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని రామ్మోహన్ నాయుడు ట్విటర్ వేదికగా ప్రకటించారు. తన అభ్యర్థనను అంగీకరించినందుకు రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.
విశాఖపట్నం నుంచి శబరిమలై వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు లేకపోవడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన అయ్యప్ప భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ కోస్ట్ రైల్వే GM, వాల్తేర్ DRMకు గత వారం రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు.
లేఖతోపాటు వారితో వ్యక్తిగతంగా మాట్లాడానని, అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనుండటం ముదావహమన్నారు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర నుంచి షిరిడీ వెళ్లే భక్తులకు విశాఖపట్నం నుంచి వారానికి ఒకరోజే తిరుగుతోందని, మూడు జిల్లాల ప్రజలకు ఉపయోగపడేలా ప్రతిరోజు షిరిడీకి రైలు తిప్పాలని మరో అభ్యర్థన చేశారు. సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని అధికారులు ఎంపీకి తెలిపారు.