తిరుమలలో నిబంధనల ఉల్లంఘన- రూ. లక్ష జరిమానా: ఆ వాహనాలు సీజ్
Tirumala Srivari Brahmotsavalu 2024: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం రాత్రి సర్వభూపాల వాహనంపై కాళీయ మర్ధనుడి అలంకారంలో దర్శనం ఇచ్చారు శ్రీమలయప్ప స్వామివారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులను కరుణించారు.
బ్రహ్మోత్సవాల్లో కీలకమైనది గరుడ సేవ. ఈ సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల గరుడ వాహనారూఢుడై దర్శనం ఇస్తారు శ్రీమలయప్ప స్వామివారు. ఈ వైభవాన్ని తిలకించడానికి ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తిరుమలకు చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సారి దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేశారు. దీనిపై టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు సమీక్ష నిర్వహించారు.
తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధిక ధరలకు తినుబండారాలు, కూల్డ్రింక్స్, ఇతర ఆహార వస్తువులను విక్రయిస్తోన్న దుకాణాలపై తిరుమల తిరుపతి దేవస్థానం రెవెన్యూ విభాగం అధికారులు కొరడా ఝుళిపించారు.
నిబంధనలకు విరుద్ధంగా భక్తుల నుంచి గరిష్ఠ ధర కంటే అధికంగా కూల్డ్రింక్స్ను విక్రయిస్తోన్న దుకాణాలను సీజ్ చేశారు. వాటి యజమానులపై లక్ష రూపాయల జరిమానా విధించారు. అధిక రేట్లకు విక్రయిస్తోన్న మూడు దుకాణదారుల నుంచి జరిమానా మొత్తాన్ని వసూలు చేసి, సీజ్ చేసినట్లు వెల్లడించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా చేపట్టిన వాహన తనిఖీల సందర్భంగా అలిపిరి వద్ద మూడు చొప్పున టెంపోలు, జీపులను తిరుపతి జిల్లా రవాణా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పర్మిట్ నిబంధనలను అతిక్రమించినట్లు గుర్తించిన పల వాహనాలపై తనిఖీ రసీదులు నమోదు చేశారు.
మోటార్ వెహికల్ యాక్ట్ను ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీ మోహన్, ప్రసాద్ వర్మ, స్వర్ణలత హెచ్చరించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని తిరుమల ఘాట్ రోడ్లపై ప్రయాణించకూడదని అన్నారు.












Click it and Unblock the Notifications