'పుష్కరాల్లో సొంత ముద్రకోసం చంద్రబాబు', లూప్లైన్లో ఎస్పీ హరికృష్ణ?
రాజమండ్రి: పుష్కర ఏర్పాట్లలో అధికారుల వైఖరి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉందని వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలే ముందు తీసుకుంటే 27 మంది చనిపోయేవారు కాదన్నారు.
పుష్కరాల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన ముద్ర కోసం ప్రయత్నాలు చేశారని, అందులో ఆయన విఫలమయ్యారన్నారు. జ్యోతుల నెహ్రూ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం నాడు పుష్కర స్నానం ఆచరించారు.
అర్బన్ ఎస్పీ లూప్ లైన్లో?
రాజమండ్రి అర్బన్ ఎస్పీ హరికష్ణను లూప్ లైన్లో పెట్టారా అనే చర్చ సాగుతోంది. పుష్కర ఘాట్ దుర్ఘటనకు బాధ్యుడిగా ఆయన పైన వేటు పడవచ్చునని చెబుతున్నారు. పుష్కరాల ప్రారంభం రోజున పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందారు.
ఈ సంఘటన అనంతరం పుష్కర విధులకు సంబంధించి అర్బన్ ఎస్పీని లూప్ లైన్లో పెట్టేశారని తెలుస్తోంది. పుష్కర విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి ఆహారం, ఇతర సౌకర్యాల కల్పన బాధ్యతలు అప్పగించారు. ఆయన పైన త్వరలో వేటుపడే అవకాశముందనే చర్చ సాగుతోంది.
పుష్కర ఏర్పాట్లు, భక్తులను నియంత్రించడం వంటి వ్యవహారాల్లో అర్బన్ పోలీసులను దూరంగా ఉంచారని అంటున్నారు. ఇదిలా ఉండగా, పుష్కరాల నిర్వహణకు సంబంధించి భక్తులను అదుపు చేసే బాధ్యతను కర్నాటక పోలీసు అధికారులకు అప్పగించారని చెబుతున్నారు.
శాంతిభద్రతల బాధ్యతను వారికి అప్పగించారని చెబుతున్నారు. కర్నాటక స్టేట్ పోలీసు, కర్నాటక స్టేట్ రిజర్వ్ పోలీసులకు అన్ని ఘాట్లలో ప్రాధాన్యమిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పుష్కరాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు చేపట్టడంలో జిల్లా పోలీసు యంత్రాంగం విఫలమైందని చెప్పారు.