రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ...వేల కోట్ల అప్పుల్లో ఉంది :చల్లా రామకృష్ణారెడ్డి
విజయనగరం:ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ రూ.12,500 కోట్ల అప్పులో ఉందని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు చల్లా రామకృష్ణారెడ్డి తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శనివారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
సివిల్ సప్లయిస్ సంస్థ ఏడాదికి రూ.15,590 కోట్ల వ్యాపారాన్ని చేస్తోందని చల్లా చెప్పారు. పేదలకు కావాల్సిన సరకులను రాయితీపై అందిస్తున్నట్లు వివరించారు. పేదలకు గతంలో కిరోసిన్ సరఫరా చేసేవారమని, అయితే ఇప్పుడు కేంద్రం నిలిపివేయడం వల్లే ఇవ్వలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. పౌరసరఫరాల సంస్థను దేశంలోనే ఆదర్శంగా మార్చేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి సంస్థ కార్యక్రమాల అమలులో సమస్యలను తెలుసుకుంటున్నామన చల్లా రామకృష్ణారెడ్డి వివరించారు. ఇటీవలే కడప జిల్లాలో రెండు పౌరసరఫరాల గోదాంలను ఆధునీకరించామని, సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సంస్థలో పనిచేసే హమాలీలు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని, లేనిపక్షంలో సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
మరోవైపు పర్యాటక రంగానికి సంబంధించి విశాఖపట్టణంను మైస్ సిటీగా తీర్చిదిద్దుతామని ఎపి పర్యాటక సాధికార సంస్థ సిఇఒ హిమాంశు శుక్లా అన్నారు. సాగర తీరంలోని నావోటెల్ వేదికగా మూడు రోజులుగా జరుగుతున్న భారతీయ టూర్ ఆపరేటర్ల అసోసియేషన్ 34 వార్షిక సదస్సులు శనివారంతో ముగిసాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన హిమాంశు శుక్లా మాట్లాడుతూ అతి తొందరలోనే విశాఖ మైస్ సిటీగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పర్యాటకరంగ పరిభాషలో ఎంఐసిఇ-మైస్ అంటే విస్తృత అర్థమే ఉందని...ఎం అంటే మీటింగ్, ఐ అంటే ఇన్సెంటివ్స్, సి అంటే కాన్ఫరెన్స్, ఇ అంటే ఎగ్జిబిషన్స్గా దీనిని వ్యవహరిస్తున్నారన్నారు. ఇలా నాలుగు విభాగాలు ఒకే చోట ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయని, హైదరాబాద్ హైటెక్ సిటీ మాదిరిగా ఈ నిర్మాణాలు ఉంటాయని చెప్పారు. రెండు మూడు సంస్థలు ఇక్కడ మైస్ సిటీలను నిర్మించేదుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని, త్వరలోనే సిఎం సమక్షంలో వీటికి సంబంధించిన అవగాహన ఒప్పందాలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు.