అడ్డగోలుగా విభజన, ఇప్పుడు ప్రత్యేక హోదాపై వస్తారా?: రఘువీరాకు చేదు అనుభవం
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులకు విశాఖపట్నంలో బుధవారం చేదు అనుభవం ఎదురయింది. అధికారంలో ఉండగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి, ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ ప్రజల ముందుకు ఎలా వస్తారని విద్యార్థులు ప్రశ్నించారు. అప్పుడు సమైక్య పోరు, ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం అంటూ మమ్మల్ని సమిధలు చేయాలనుకుంటున్నారా అని అడిగారు.
మీ రాజకీయాల కోసం యువకులు, విద్యార్థుల జీవితాలతో చెలాగాటాడుతున్నారని, అన్ని రాజకీయ పార్టీలు కలిసి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదాను మీరే సాధించవచ్చుకదా అని అన్నారు. మీ వల్ల సాధ్యం కాని ప్రత్యేక హోదా తమ ఎస్సెమ్మెస్ల ద్వారా వచ్చేస్తుందా ప్రశ్నించారు. దీంతో రఘువీరారెడ్డి, కాంగ్రెస్ నేతలు ఉక్కిరి బిక్కిరయ్యారు. కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం ఒక్క ఎస్సెమ్మెస్ పేరిట తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా రఘువీరా సహా మాజీ మంత్రులు పలువురు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
విద్యార్థుల నుంచి బాణాల్లా దూసుకొచ్చిన ప్రశ్నలతో నేతలంతా కంగుతిన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి, లైట్లార్పి విభజన చట్టాన్ని ఆమోదించారు. ప్రత్యేక హోదా అంశాన్ని అప్పుడే చట్టంలో ఎందుకు పొందు పరచలేదని విద్యార్థులు నిలదీశారు. సమైక్య ఉద్యమం పేరిట రెండు నెలలపాటు చదువు లేకుండా రోడ్డున పడ్డ తాము ఇప్పుడు మళ్లీ ప్రత్యేక హోదా అంటూ జరుగుతున్న ఉద్యమంలోనూ పాల్గొని తమ చదువులను ఫణంగా పెట్టాలా అంటూ నిలదీశారు.
పనిలోపనిగా అధికార తెలుగుదేశం పార్టీ తీరుపైనా విద్యార్థులు మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్, జపాన్ దేశాల నుంచి ఇంజనీర్లను అరువు తెచ్చుకుంటున్న ప్రభుత్వానికి రాష్ట్రంలో ఇంజనీరింగ్ పట్టాలు చేతపట్టుకుని నిరుద్యోగులుగా తిరుగుతున్న యువత కన్పించటం లేదా అన్నారు. దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావట్లేదని, దానిని పూర్తిచేయవచ్చు కదా అని అన్నారు.
రఘువీరారెడ్డి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తూ విభజన పాపం తమది కాదని, అన్ని పార్టీలు సూచిస్తేనే తాము నిర్ణయం తీసుకున్నామంటూ సర్దిచేప్పుకునే ప్రయత్నం చేశారు. చివరకు ప్రత్యేక హోదా సాధించాలంటే మీ సహకారం అవసరం, అందుకు మీరు సిద్ధంగా ఉండండంటూ ముగించారు.