గంటాకు నివేదిక, రిషికేశ్వరి కేసులో బాబుకి ఫోన్ చేస్తానన్న రాజ్నాథ్
ఢిల్లీ/గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషికేశ్వరి మృతి పైన మంత్రి గంటా శ్రీనివాస రావుకు బాలసుబ్రహ్మణ్యం కమిటీ మధ్యంతర నివేదికను ఇచ్చింది. మూడు రోజుల పాటు విశ్వవిద్యాలయంలో విచారించి.. ఈ ప్రాథమిక నివేదికను ఆదివారం ఇచ్చింది.
కమిటీ ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ఆదివారం ఏపీ విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాస రావును కలిసి నివేదిక సమర్పించారు. ఇతర అంశాలపై మంత్రి గంటాతో బాలసుబ్రహ్మణ్యం చర్చించారు.
విచారణలో హాజరు కావాల్సిన విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ రాకపోవడంతో పాటు కేసుకు సంబంధం ఉన్న కొంతమంది విద్యార్థులు కూడా హాజరు కాకపోవడంతో మధ్యంతర నివేదికతో సరిపెట్టవలసి వచ్చిందని తెలుస్తోంది. విశ్వవిద్యాలయం విభాగం కూడా రిషికేశ్వరి మృతితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.
ప్రభుత్వం మాత్రం బాలసుబ్రహ్మణ్యం కమిటీని ఈ నెల 10వ తేదీ వరకు నివేదిక ఇచ్చేందుకు గడువును పొడిగించింది.
రాపోలుకు రాజ్నాథ్ సింగ్ హామీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ ఆదివారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్తో భేటీ అయి రిషికేశ్వరి మృతి పైన సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ.. తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తానని రాపోలుకు హామీ ఇచ్చారు.