కేశినేని-దేవినేని పోటీ పడ్తున్నారు.. గొడవలేదని ట్విస్ట్: సుజన క్లాస్!
విజయవాడ: బెజవాడలో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, ఎంపీ కేశినేని నానిల మధ్య రగడను చల్లార్చేందుకు కేంద్రమంత్రి సుజనా చౌదరి రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా నేతలకు సుజన క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇరు వర్గాలతో సుజన ఓ హోటల్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుజన వారితో... చిన్న చిన్న విషయాల్లో రభస చేసుకోవడం సరికాదని సూచించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రం అభివృద్ధి, రాజధాని నిర్మాణం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంటే మనం కలహించుకోవడం సరికాదని చెప్పారని తెలుస్తోంది.
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగినా కాంగ్రెస్ వాళ్లు రోడ్డెక్కారా అని వారిని నిలదీశారని తెలుస్తోంది. ఇకనైనా మనం సంయమనంతో వ్యవహరించాలని, అభివృద్ధి కోసం పోటీ పడాలని వారికి సూచించినట్లుగా తెలుస్తోంది.

విభేదాలు లేవు: సుజనా చౌదరి
కేశినేని నాని, దేవినేని ఉమామహేశ్వర రావుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని సుజనా చౌదరి చెప్పారు. వారిద్దరు పని చేసేందుకు పోటీ పడుతున్నారని చెప్పారు. అధికారుల బదలీల్లో జాప్యం వల్ల సమస్యలు తలెత్తాయని, వారంలోగా బదలీల ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పారు.
ప్రతి ఎమ్మెల్యే ఒక్కో గ్రామాన్ని తీసుకొని ఆదర్శ గ్రామంగా తయారు చేయాలని సూచించారు. కోట్లు దోచుకోవడానికి నాడు వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సఖ్యత ఉండేదని, ఇప్పుడు తమ పార్టీకి చెందిన నేతలు మాత్రం అభివృద్ధి కోసం పోటీ పడుతున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications