తెలుగు అకాడమీ విభజనపై ఏపీ ,తెలంగాణా ప్రభుత్వాలకు సుప్రీం కీలక సూచన
తెలుగు అకాడమీ ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపకాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని, సుప్రీం ధర్మాసనం ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది . తెలుగు అకాడమీ ఉద్యోగులు ,ఆస్తులు ,అప్పుల పంపకాలపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ విధంగా సూచించింది.
రిజర్వేషన్లు ఇంకా ఎన్ని తరాలు ? మహారాష్ట్ర మరాఠా కోటా అంశంపై విచారణలో సుప్రీం ధర్మాసనం ప్రశ్న
తెలుగు అకాడమీ విభజన అంశంపై తెలుగు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
గతంలో తెలంగాణా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసిన తెలంగాణ ప్రభుత్వం తెలుగు అకాడమీ విభజన అంశం న్యాయ పరిధిలోకి రాదని, దీనిపై తెలంగాణ హైకోర్టు ఏ విధంగా ఆదేశాలు జారీ చేస్తుంది అంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన జస్టిస్ వై చంద్ర చూడ్, జస్టిస్ ఎమ్మార్ షా ధర్మాసనం వాద ,ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇరు రాష్ట్రాల అధికారులు కలిసి కూర్చుని చర్చించి ఉద్యోగుల, ఆస్తుల పంపకాలపై నిర్ణయం తీసుకోవాలని తన నోటీసు ద్వారా తెలియజేసింది .
అకాడమీ విభజనపై ఏకాభిప్రాయానికి రావాలన్న సుప్రీం .. లేదంటే విచారణ చేస్తామని స్పష్టం
తెలుగు అకాడమీ విభజనపై ఏకాభిప్రాయానికి రాకపోతే విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. 2018 డిసెంబర్ నుండి తమకు వేతనాలు అందడం లేదని ఉమ్మడి అకాడమీని విభజిస్తే తమకు న్యాయం జరుగుతుందని ఏపీ పరిధిలోని తెలుగు అకాడమి ప్రాంతీయ కేంద్రాల్లో పనిచేస్తున్న రోజువారి , ఒప్పంద సిబ్బంది తెలంగాణ హైకోర్టులో గత నవంబర్లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జనవరిలో జస్టిస్ రామచంద్రరావు జస్టిస్ అమర్నాథ్ గౌడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
వేతనాల కోసం కోర్టును ఆశ్రయించిన ఏపీ అకాడమీ ఉద్యోగులు .. హైకోర్టు తీర్పు
విచారణలో భాగంగా ధర్మాసనం తెలుగు అకాడమీ విభజనకు రెండు నెలల్లో మార్గదర్శకాలను రూపొందించుకోవాలని ఆ తరువాత నెల రోజులలో కేటాయింపులు పూర్తిచేయాలని తీర్పునిచ్చింది. అంతేకాదు సిబ్బందికి చెల్లించాల్సిన వేతనాలు, పిటిషనర్లకు అసౌకర్యం కలిగించినందుకు 17 మందికి మూడు వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. మొత్తంగా మూడు నెలల్లో అకాడమీ విభజన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన తెలంగాణా సర్కార్
అయితే అకాడమీ విభజన న్యాయ పరిధిలోనికి రాదని దీనిపై ఏ విధంగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇస్తుందని సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ సర్కారు. ఇక తాజాగా జరిగిన విచారణలో రెండు తెలుగు రాష్ట్రాలు కూర్చుని చర్చించుకుని అకాడమీ విభజన చేయాలని సూచించింది . లేదంటే సుప్రీం ధర్మాసనం విచారణ చేపడుతుంది అని స్పష్టం చేసింది.