జగన్ కేసుల్లో ఇంకా వెంటాడుతున్న సీబీఐ: హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకు: నోటీసులు జారీ..!
వైసీపీ అధినేత..ఏపీ ముఖ్యమంత్రి పైన గతంలో నమోదైన అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ ఇంకా వెంటాడుతూనే ఉంది. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొన్న అధికారులకు గతంలో హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. అయితే..హైకోర్టు ఉత్తర్వుల మీద సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. దీంతో..తాజాగా సుప్రీం నోటీసులు జారీ చేసింది. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా క్విడ్ ప్రోకో కు పాల్పడ్డారని జగన్ మీద అప్పట్లో సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. మొత్తం 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది.
వీటి పైన సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ చేస్తోంది. అదే సమయంలో సీబీఐ అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారుల విషయంలో అప్పట్లో మినహాయింపు లభించింది. కానీ, ఇప్పుడు తిరిగి సీబీఐ అప్పుడూ..ఇప్పుడూ ఒకే శాఖలో కీలక అధికారిగా ఉన్న ఒక ఐఏయస్ పైన సుప్రీం ను ఆశ్రయించగా..నోటీసులు జారీ అయ్యాయి. దీంతో..సీబీఐ వేస్తున్న అడుగుల పైన రాజకీయంగానూ చర్చ మొదలైంది.
కాశ్మీర్ పై డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన: ఇద్దరు ప్రధానులు అంగీకరిస్తే..మధ్యవర్తిత్వం
ఐఏయస్ అధికారికి సుప్రీం నోటీసులు
జగన్ అక్రమాస్తుల కేసులో నాడు సీబీఐ అభియోగాలు ఎదుర్కొన్ని ఐఏయస్ అధికారి ఆదిత్య నాధ్ దాస్ కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. గతంలో ఆయన మీద నమోదు చేసిన కేసుల నుండి తప్పిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల పైన సీబీఐ సుప్రీం ను ఆశ్రయించింది. ఆదిత్యనాధ్ దాస్ పై వచ్చిన అభియోగాలను విచారిస్తున్న సీబీఐ కోర్టులో క్రిమినల్ ప్రోసీడీంగ్స్ పైన స్టే విధిస్తూ ఏపీ హైకోర్టు 2016 ఏప్రిల్ 22 న ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు నుండి ఆదిత్య నాధ్ దాస్ ను మినహాయిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. క్రిష్ణా..రంగారెడ్డి జిల్లాల్లో ఇండియా సిమెంట్స్ కు చెందిన ఫ్యాక్టరీ కి నీటిని కేటాయించారనే అభియోగాల పైన సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. కాగా, తాజా విచారణలో ఆదిత్య నాద్ దాస్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇంటర్ స్టేట్ వాటర్ రెగ్యులేటరీ కౌన్సిల్ అనుమతి మేరకు నీటిని కేటాయించారని కోర్టుకు నివేదించారు. విచారణపై హైకోర్టు స్టే ఇవ్వటాన్ని సీబీఐ న్యాయవాది వ్యతిరేకించారు. ఫలితంగా ఇప్పుడు సుప్రీంను ఆశ్రయించగా నోటీసులు జారీ అయ్యాయి. అప్పట్లో అభియోగాల సమయంలో ఆయన ఉమ్మడి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం లో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇక, ఇప్పుడు ఈ నోటీసుల పైన చర్చ మొదలైంది.
సీబీఐ కొత్త అడుగుల పైన చర్చ..
2016లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల పైన సీబీఐ సుప్రీంను ఆశ్రయించటం పైన ఇప్పుడు రాజకీయంగానూ చర్చ మొదలైంది. జగన్ పైన కేసుల విచారణ సాగుతూనే ఉంది. తొలుత రాజకీయంగా లక్ష కోట్ల అవినీతి అంటూ టీడీపీ..కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేసారు. అయితే..సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లలో నమోదు చేసిన అక్రమాస్తుల అభియోగాలు సగానికి పైగా నిరాధారమని నిర్ధారించినట్లుగా వైసీపీ నేతలు చెబుతున్నారు. మిగిలిన కేసుల పైన జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకూ కోర్టుకు హాజరయ్యారు. అయితే, తాను సీఎం అయినత తరువాత కోర్టుకు హాజరు కాలేనని..తన తరపున న్యాయవాది హాజరు అవుతారని కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీనిని కోర్టు విచారణకు స్వీకరించింది. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొన్న ఐఏయస్ అధికారులు ఆదిత్యనాధ్ దాస్.. మన్మోహన్ సింగ్.. శ్యామ్యూల్ వంటి వారు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలోనే పని చేస్తున్నారు. శ్రీలక్ష్మి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో పని చేస్తున్నా..ఏపీకి వచ్చేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా సీబీఐ ఆదిత్య నాద్ దాస్ విషయంలో సుప్రీంను ఆశ్రయించటం ద్వారా మరోసారి ఈ కేసుల కలకలం మొదలైంది. సీబీఐ వేసే తరువాతి అడుగుల మీద ఏ రకంగా ఉంటాయనే ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పుడు కేవలం ఆదిత్య నాధ్ దాస్ విషయంలో మాత్రమే సీబీఐ ముందుకు వెళ్తోంది.
మరో సారి జనగ్ కేసుల చర్చ..
ఇప్పుడు ఆదిత్య నాధ్ దాస్ విషయంలో సీబీఐ సుప్రీంను ఆశ్రయించటం.. నోటీసులు జారీ అవ్వటంతో మరో సారి జగన్ కేసుల అంశం రాజకీయంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. జగన్ పైన కేసులు నమోదైన సమయం నుండి టీడీపీ టార్గెట్ చేసింది. జగన్ పైన నమోదైన కేసుల్లో టీడీపీ సైతం అప్పట్లోనే ఇంప్లీడ్ అయింది. అయితే..తనను రాజకీయంగా వేధించేందుకే కేసులు పెట్టారంటూ జగన్ అనేక సందర్బాల్లో చెప్పుకొచ్చారు. గత ఎన్నికల ప్రచార సమయంలోనూ టీడీపీ జగన్ అవినీతి గురించే ప్రధానంగా ప్రచారం చేసింది. జగన్ ఆ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక, ఇప్పుడు ఆదిత్య నాద్ దాస్ విషయం లో తిరిగి చోటు చేసుకున్న పరిణామాలు..రాజకీయంగా మరో సారి చర్చకు కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.