వివేకా కేసులో మరో కీలక పరిణామం-సునీత వినతికి సుప్రీం అంగీకారం..!
ఆరేళ్ల క్రితం దారుణ హత్యకు గురైన ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు వివిధ కారణాలతో కోర్టులో బెయిల్ తీసుకున్నారు. వీరి బెయిల్ రద్దు కోసం వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడుతున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
వివేకాను హత్య చేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించిన నిందితుల్లో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఒకరు. ఆయన్ను సీబీఐ గతంలో అరెస్టు చేసింది. అయితే ఆయన కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. అయితే ఉదయ్ కుమార్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో వివేకా కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఉదయ్ కుమార్ రెడ్డి పాత్రపై ప్రశ్నలు గుప్పించింది.

వివేకా హత్య కేసులో ఉదయ్ పాత్ర ఏంటని పిటిషనర్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో పిటిషనర్ సునీత లాయర్.. తన తండ్రిని హత్య చేసిన తర్వాత గాయాలు కనపడకుండా కుట్లు వేసి గుండెపోటుగా చిత్రీకరించిన వారిలో ఉదయ్ కుమార్ రెడ్డి కూడా తెలిపారు. దీంతో ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో మీ బెయిల్ ఎందుకు రద్దుచేయకూడదో చెప్పాలంటూ ఉదయ్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లతో దీన్ని కూడా జత చేయాలని కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications