ఏపీ ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశం- ఏపీ సర్కార్, చంద్రబాబు ఇద్దరికీ..
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్ నెట్ స్కాంకు సంబంధించి సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న విపక్ష నేత చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు చేసిన విజ్ఞప్తిపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. ఇవాళ ఆయనతో పాటు ఏపీ ప్రభుత్వానికీ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ ఫైబర్ నెట్ కేసుపై చంద్రబాబు మాట్లాడకుండా కట్టడి చేయాలని సుప్రీంకోర్టును ఏపీ సీఐడీ కోరింది. అయితే ప్రభుత్వం కూడా దీనిపై మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని చంద్రబాబు లాయర్ కోరారు. దీంతో న్యాయస్ధానంలో ఉన్న కేసుపై ఇరు వర్గాల్ని మాట్లాడకుండా కట్టడి చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణను జనవరి 17వ తేదీకి వాయిదా వేసింది. ఇవాళ కేసు విచారణ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాడీవేడీ వాదనలు సాగాయి.

ఫైబర్ నెట్ కేసుకు సంబంధించిన అంశాలపై చంద్రబాబు బహిరంగంగా మాట్లాడటంపై సీఐడీ అభ్యంతరం తెలిపింది. తనను జైలుకు పంపిన అంశాలపై చంద్రబాబు బయట మాట్లాడుతున్నట్లు ప్రభుత్వ లాయర్లు సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. కాబట్టి ఈ కేసుపై చంద్రబాబు బహిరంగంగా మాట్లాడకుండా ఆంక్షలు విధించాలని లాయర్లు కోరారు. అనంతరం చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా వాదిస్తూ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అదనపు ఏజీ పొన్నవోలుతో పాటు సీఐడీ ఛీఫ్ సంజయ్ ఢిల్లీ వరకూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న విషయాన్ని ప్రస్తావించారు.
ఇరు వర్గాల వాదనలపై స్పందించిన సుప్రీంకోర్టు... కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఇరు వర్గాలను ఆదేశించింది. ఈ మేరకు ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో ఈ కేసు విచారణను జనవరి 17కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications