4 వారాల్లోనే లేదంటే..: సుప్రీంలో ఓటుకు నోటుపై బాబుకు షాక్, జోక్యం చేసుకోమని ఆళ్లకు షాక్
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం నాడు ఇచ్చిన ఆదేశాలు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు షాక్ అని చెప్పవచ్చు. ఓటుకు నోటు కేసును నాలుగు వారాల్లో తేల్చాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓ విధంగా ఆళ్ల నానికి కూడా సుప్రీం షాకిచ్చింది. హైకోర్టులో విచారణలో ఉన్నందున ఈ కేసులో తాము ఇప్పుడే జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
ఓటుకు నోటు కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత నెలలో ఏసీబీ న్యాయస్థానాన్ని కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్టే కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
చంద్రబాబు పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఎనిమిది వారాల పాటు స్టే విధించింది. దీంతో ఆళ్ల రామకృష్ణా రెడ్డి దీనిపై హైకోర్టు స్టే పైన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు శుక్రవారం నాడు హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
'ఓటుకు నోటులో చంద్రబాబుపై పూర్తి ఆధారాలు': సుప్రీం కోర్టులో ఇలా..ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్ పైన నాలుగు వారాల్లో తేల్చాలని హైకోర్టుకు సుప్రీం సూచించింది. హైకోర్టు ఎనిమిది వారాల పాటు స్టే ఇవ్వగా, నాలుగు వారాల్లో తేల్చాలని సుప్రీం కోర్టు సూచించడం గమనార్హం. అదే సమయంలో నాలుగు వారాల్లో తేల్చకుంటే మళ్లీ తమను ఆశ్రయించవచ్చునని సుప్రీం కోర్టు తెలిపింది. కాగా, రాజకీయ శతృత్వంతోనే ఆళ్ల పిటిషన్ దాఖలు చేసినట్లుగా భావిస్తున్నామని, ఇటువంటి కేసుల వెనుక ఎన్నో ఉద్దేశ్యాలుంటాయని కోర్టు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.
ఆస్తుల కేసులో కోర్టుకు హాజరైన జగన్
ఆస్తుల కేసులో వైసిపి అధినేత జగన్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సాక్షి పత్రికలో రాంకీ సంస్థ పెట్టుబడుల పైన విచారిస్తున్న ఈడీ న్యాయస్థానం ఆయనకు సమన్లు జారీ చేయడంతో గగన్ విహార్లో హాజరయ్యారు. జగతి పబ్లికేషన్స్లో రాంకీ పెట్టిన రూ.10 కోట్ల పెట్టుబడులు అక్రమమని ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. దీనిపై విచారణకు జగన్తో పాటు విజయ సాయి రెడ్డి, వెంకట్రామిరెడ్డి, అయోధ్య రామిరెడ్డిలు హాజరయ్యారు.