ఏబీ వేంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు - సుప్రీం ఆదేశం : ఏపీ ప్రభుత్వ పిటీషన్ తోసిపుచ్చుతూ..!!
ఏపీ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వరావుకు భారీ రిలీఫ్ దొరికింది. ఆయన సస్పెన్షన్ రద్దు చేస్తూ సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. ఏబీ వేంకటేశ్వర రావును తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ ను సుప్రీ తోసిపుచ్చింది. ఇదే సమయంలో హైకోర్టు ఈ కేసులో ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేసారు. సస్పెన్షన్ విధించిన రెండేళ్ల తరువాత కొనసాగింపు కుదరదని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది.

ప్రభుత్వ ఎస్ఎల్పీ తోసిపుచ్చుతూ
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2020 మే 22న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీని పైన నిన్న (గురువారం) విచారించిన ధర్మాసనం 1969 అఖిల భారత సర్వీసుల నిబంధనల ప్రకారం సస్పెన్షన్ రెండేళ్లకు మించి కొనసాగకూడదని.. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ను విచారించడానికి కారణాలేమీ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. అధికారిని ఎప్పుడు సస్పెండ్ చేశారని ధర్మాసనం ప్రశ్నించగా.. 2020 ఫిబ్రవరి 8న అని న్యాయవాది తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7కే రెండేళ్లు పూర్తయ్యాయని, కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు సిఫార్సు చేశారని న్యాయస్థానం ప్రశ్నించింది.

సస్పెన్షన్ కాలం పూర్తయ్యాక సిఫార్సులేంటంటూ
క్రిమినల్ ప్రొసీజర్స్కు సంబంధించి మార్చి 27న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశామని, అధ్యయనానికి కేంద్రం యూపీఎస్సీకి పంపిందని.. రివ్యూ కమిటీ వేసిందని సీయూ సింగ్ తెలిపారు. రెండేళ్లు పూర్తవకముందే లేఖ రాయాలని, ఆ తర్వాత లేఖ రాస్తే చెల్లదని ధర్మాసనం విచారణ సమయంలోనే స్పష్టం చేసింది. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత సిఫార్సు చేశారంటే అప్పటికే సస్పెన్షన్ ఆటో మేటిక్ గా రద్దయినట్లుగా కోర్టు పేర్కింది. కేంద్రానికి పంపిన సిఫార్సు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ప్రభుత్వ తరపున న్యాయవాది సమయం కోరటంతో..ఈ రోజు వరకు గడువు ఇచ్చారు.

తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశం
తిరిగి..ఈ రోజు విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఏబీ వేంకటేశ్వర రావుకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సుప్రీం ఆదేశించటంతో.. ప్రభుత్వ తదుపరి చర్యల పైన ఆసక్తి నెలకొని ఉంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన ఇంటలిజెన్స్ చీఫ్ గా కొనసాగారు. ప్రస్తుతం ఏబీ వేంకటేశ్వరారవు అదనపు డీజీ హోదాలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన సమయం నుంచి ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇక, ఇప్పుడు సుప్రీం ఆదేశాలతో ఏబీ వేంకటేశ్వరారవు పోస్టింగ్ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఈ రోజు లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications