వివేకా పీఏ రిక్వెస్ట్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు-దస్తగిరికీ దక్కిన ఊరట..!
ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ కేసులో బాధితులెవరో, నిందితులెవరో తేల్చుకోలేక సీబీఐ సైతం సతమతం అవుతున్న పరిస్ధితి. ఈ క్రమంలో వివేకా పీఏ కృష్ణారెడ్డి తనను బాధితుడిగా పరిగణించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయన విజ్ఞప్తిని పరిశీలించిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది.
వివేకా హత్య జరిగిన విషయాన్ని ముందుగా గుర్తించి అందరికీ సమాచారం చేరవేసిందీ, ఆయన రాశారని చెబుతున్న లేఖను అల్లుడు రాజశేఖర్ రెడ్డికి అందించిందీ పీఏ కృష్ణారెడ్డే. ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుని పలుమార్లు ప్రశ్నించింది. అయితే ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వివేకా హత్య గురించి లోకానికి ముందుగా తెలియజేసిన తనను బాధితుడిగా పరిగణించాల్సింది పోయి నిందితుడిని చేస్తున్నారంటూ కృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు.

ఇదే అంశాన్ని హైలెట్ చేస్తూ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను వివేకా కేసులో బాధితుడిగా పరిగణించేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ ఫైల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కుదరదని స్పష్టం చేసింది. అయితే నిందితుడిగా కాకుండా కేవలం అనుమానితుడిగా సీబీఐ విచారణ జరుపుకునేందుకు అవకాశం ఉందని తెలిపింది. అలాగే కృష్ణారెడ్డి చేసిన మరో విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది.
వివేకా కేసులో ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కృష్ణారెడ్డి చేసిన అభ్యర్ధనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అలాగే తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలతో సంబంధం లేకుండా తెలంగాణ హైకోర్టు స్వతంత్రంగా విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోవచ్చని కూడా సుప్రీంకోర్టు తేల్చిచెప్పేసింది. దీంతో తిరిగి బంతి హైకోర్టులోకే వచ్చి పడినట్లయింది.












Click it and Unblock the Notifications