రఘురామకు సుప్రీంకోర్టు బెయిల్-కీలకంగా మెడికల్ రిపోర్ట్ -మీడియాఇంటర్వ్యూలకు నో
ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రఘురామరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతకుముందు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన నివేదికలో రఘురామ కాలికి గాయాలైనట్లు తేలడంతో బెయిల్ మంజూరులో ఇదో కీలకాంశంగా మారింది.

రఘురామకు సుప్రీంలో భారీ ఊరట
ఏపీ సీఐడీ దాఖలు చేసిన రాజద్రోహం కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎట్టకేలకు అనుకూలమైన ఫలితాన్ని సాధించారు. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం రఘురామరాజుకు బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలోనే ఉన్న రఘురామరాజు డిశ్చార్జ్ అయ్యేందుకు అవకాశం లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు అందగానే ఆయనకు విముక్తి లభించనుంది.

రఘురామ బెయిల్పై వాడీవేడీగా వాదనలు
ఈ కేసులో రఘురామ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా.. ఏపీ ప్రభుత్వం తరఫున మరో సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే వాదించారు. రఘురామరాజు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు మినహా మరే ఇతర కుట్రకు సంబంధంచిన ఆధారాల్ని కోర్టుకు అందించడంలో సీఐడీ, ప్రభుత్వం విఫలమైనట్లు తెలుస్తోంది. రఘురామను అరెస్టు చేసిన విధానం నుంచి బెయిల్ వరకూ అన్ని అంశాలపై సుప్రీంకోర్టులో లాయర్లు దవే, రోహత్గీ సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం రఘురామరాజుకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

కీలకంగా మారిన మెడికల్ రిపోర్ట్
రఘురామరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆయనపై చేసిన రాజద్రోహం ఆరోపణల కంటే కస్టడీలో ఆయనకు అయిన గాయాలు కీలకంగా మారిపోయాయి. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లు రఘురామరాజు గాయంతో బాధపడుతున్నట్లు నివేదికలో తేల్చడంతో ఈ నివేదిక విచారణలో కీలకంగా మారింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రఘురామరాజుకు బెయిల్ మంజూరు చేసింది.

రఘురామకు బెయిల్ వెనుక కారణాలివే
రఘురామ రాజుకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి ప్రధానంగా ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్దితులే కీలకంగా మారాయి. తాజాగా ఈ ఏడాది జనవరిలో రఘురామరాజుకు గుండె శస్త్రచికిత్స జరగడం, ప్రస్తుతం ఆయన కాలికి గాయం ఉండటాన్ని సుప్రీంకోర్టు ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంది. అలాగే సీఐడీ కస్టడీలో రఘురామపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్లు కూడా గుర్తించింది.
ఇంకా ఆయన్ను రిమాండ్ లేదా కస్టడీలో ఉంచితే ఆరోగ్య పరిస్ధితి దెబ్బతినే ప్రమాదమున్నట్లు సుప్రీంకోర్టు భావించినట్లు తెలుస్తోంది.
దీంతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
Recommended Video

రఘురామ బెయిల్కు సుప్రీం షరతులివే
రఘరామరాజుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఆయనకు కొన్ని షరతులు కూడా విధించింది. ఇందులో ప్రధానంగా మీడియా ఇంటర్వూలు ఇవ్వొద్దని, విచారణ సమయంలో మీడియాకు ప్రకటనలు కూడా ఇవ్వొద్దని ఆదేశించింది. సీఐడీ విచారణకు సహకరించాలని, సాక్ష్యుల్ని ప్రభావితం చేయకూడదని సూచించింది. విచారణ అధికారులు పిలిచినప్పుడు హాజరుకావాలని, విచారణ అధికారులు కూడా ఆయనకు 24 గంటల ముందు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ట్రయల్ కోర్టులో లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు రెండు సెక్యూరిటీలు కూడా సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications