ఏపీలో కబ్జాలపై కొరడా ... దేవుడిమాన్యాల ఆక్రమణలపై డ్రోన్ లతో సర్వేకి రంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కొరడా ఝుళిపించటానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఏపీలో ఉన్న అన్ని భూములపై సర్వే నిర్వహించి భూములకు ప్రత్యేక గుర్తింపు నెంబర్లను ఇవ్వాలని, ఆధార్ తరహాలో భూధార్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రెవిన్యూ భూముల సర్వే కొనసాగుతోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో దేవుడి మాన్యాల ఆక్రమణలను గుర్తించేందుకు కూడా రంగంలోకి దిగింది.
దేవుడి మాన్యాల ఆక్రమణలపై ఏపీ సర్కార్ సర్వే
రాష్ట్రంలో దేవుడి మాన్యాలు పెద్ద ఎత్తున కబ్జాలకు గురయ్యాయి. దేవుడి మాన్యాల ఆక్రమణలను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. డ్రోన్ల ద్వారా ప్రత్యేక సర్వే నిర్వహించడానికి దేవాదాయశాఖ రంగంలోకి దిగనుంది. దేవాదాయ శాఖ పరిధిలోని 22 వేల ఆలయాలు, సత్రాలు, మఠాల పేరుతో 4,09,229.99 ఎకరాల భూమి ఉండగా 67,525.06 ఎకరాలు చాలా ఏళ్ళ నుండి ఆక్రమణలకు గురైనట్లుగా గుర్తించారు.
లీజు ముగిసినా, భూములను ఖాళీ చెయ్యని కౌలుదారులు
అంతేకాదు దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను లీజుకు తీసుకున్న చాలామంది కూడా నిర్ణీత గడువు ముగిసినప్పటికీ వాటిని ఇంకా ఖాళీ చేయడం లేదు. అలా 3613.62 ఎకరాలు కౌలుదార్ల చేతుల్లోనే ఉంది.
ఈ నేపథ్యంలోనే ఆలయాల వారిగా రికార్డులను సిద్ధం చేసి, ఆక్రమణలకు గురైన భూములను డ్రోన్లతో సర్వే నిర్వహించి, సదరు భూములను తిరిగి దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావడానికి దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం రంగంలోకి దిగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డ్రోన్ కార్పొరేషన్, దేవాదాయ శాఖ మధ్య ఈ విషయంలో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయి.
డ్రోన్ లతో సర్వే ... కబ్జా కోరల నుండి కాపాడే యత్నం
డ్రోన్లతో చిత్రీకరించిన ఫోటోలు, వీడియోలు ఆధారంగా ఆక్రమణలను అంచనా వేయడానికి, తర్వాతి దశలో చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది దేవాదాయ శాఖ.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే తాను అనుకున్న పనులు చేసుకుంటూ పోతున్నారు . రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు. అదే బాటలో ఇప్పుడు దేవాదాయశాఖ భూములను సైతం కబ్జా కోరల్లో నుండి కాపాడాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video
జగన్ సర్కార్ నిర్ణయంతో అక్రమార్కుల వెన్నులో వణుకు
సీఎం జగన్ ఆదేశాల మేరకే, ఆయన నిర్ణయంలో భాగంగా దేవాదాయ శాఖ భూముల విషయంలో సర్వే నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 120 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రెవిన్యూ భూముల సమగ్ర రీ సర్వేకు నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి భూముల రీ సర్వే నే కాకుండా, కబ్జాల పాలైన దేవాదాయశాఖ భూములపై దృష్టి పెట్టడంతో ఇప్పుడు అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతోంది.