అనుమానం వద్దు, తెలంగాణకే మద్దతు: సుష్మా
మహబూబ్నగర్: తెలంగాణపై తమ పార్టీ వెనక్కి పోయినట్లు మీడియాలో వార్తాకథనాలు వచ్చాయని, అది ఊహాజనితమేనని బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్ అన్నారు. హైదరాబాద్తో కూడిన పది జిల్లాల తెలంగాణాపై యుపిఎ ప్రభుత్వం బిల్లు పెడితే వెంటనే తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు. మహబూబ్నగర్లో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆమె ఉద్వేగంతో, ఆవేశంగా ప్రసంగించారు.
రెండు నెలలు గడుస్తున్నా కేంద్రం తెలంగాణ గురించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆమె ఆక్షేపిస్తూ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను ఎప్పుడూ మోసం చేస్తూనే ఉందని, ఈసారి ఇక మోసానికి తావు లేదని ఆమె అన్నారు. మరోసారి మోసానికి పాల్పడితే వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.
రాష్ట్ర విభజన విషయంలో ఆంధ్ర ప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందని, కాంగ్రెస్ అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకుంటే, ఆ పార్టీ నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తి పూర్తిగా విరుద్ధమైన వైఖరి తీసుకుని మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. తమ హయాంలో కూడా రాష్ట్రాల విభజన జరిగిందని, కాని అందరితోనూ మాట్లాడిన తర్వాత ప్రశాంతంగా విభజించామని ఆమె చెప్పారు.
వచ్చే శీతాకాల సమావేశంలో తెలంగాణ బిల్లు పెట్టాలని, సీమాంధ్ర సమస్యలు కూడా ఆ వెంటనే పరిష్కరిస్తామని ఆమె చెప్పారు. విభజన తర్వాత జల సమస్యలను, విద్యుత్ సమస్యలనూ చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని ఆమె సూచించారు. దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ కల నెరవేర బోతోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు విజయాన్ని ముద్దాడే మధుర క్షణాలు దగ్గరలో ఉన్నాయని, ఈ సమయంలో సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టవద్దని సుష్మా అన్నారు. స్వతహాగా పరాజితుల్లో కొన్నాళ్లు ఆవేశం ఉంటుందని అంటూ ఈ సమయంలో తెలంగాణ ప్రజలు అటువైపు వారిని రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని ఆయన ఆమె హితవు చెప్పారు.
విభజన తర్వాత కూడా హైదరాబాద్లో నివసించే తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు కలిసిమెలిసి జీవించాలని, మనం కోరుకోవలసింది ప్రాంతాలమధ్య విభజనే గాని, ప్రజల మనసుల మధ్య విభజన కాదని ఆమె చెప్పారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్నప్పుడు ప్రేమతో ఆలింగనం చేసుకునేటట్టు ఉండాలి గానీ ప్రజలమధ్య విదేషాలు రెచ్చగొట్టేటట్టు ఉండకూడదని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జెఎసి నాయకుడు కోదండరాంను బాధ్యతగల, దక్షత గల నాయకునిగా ఎంతో ప్రతిభను కనబరిచారని ప్రత్యేకంగా ప్రశంసించారు.
తెలంగాణ వస్తుందనే ఉద్దేశంతో అందరి హృదయాలలో సంతోషం ఉందని, తెలంగాణ వస్తోందనే విశ్వాసం ఉందని, అలాగే ఏమైనా ఆటంకాలు ఎదురవుతాయేమోనన్న అనుమానం కూడా ఉందని, తెలంగాణ ప్రజలకు గతంలో ఎంతో మోసం జరిగిందని ఆయన అన్నారు. డిసెంబర్ తొమ్మిదవ తేదీన అప్పటి హోం మంత్రి తెలంగాణ ప్రక్రియ జరుగుతుందని ప్రకటన వెలువరించారు గానీ ఆగిపోయిందని, అందుకే తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కూడా అనుమానాలు ఉన్నాయని ఆమె చెప్పారు.