ఏపీలో బియ్యం బదులు నగదుపై సస్పెన్స్-పోర్టబిలిటీ తేలాకే-డబ్బు తీసుకుంటే కార్డు పోతుందా ?
ఏపీలో బియ్యం బదులుగా డబ్బులు ఇచ్చే పథకంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలువుతున్న ఈ పథకాన్ని అమలుచేసే తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డుల్లోకి ఎక్కబోతోందని అనుకునే లోపే సర్కార్ ఆలోచనలో పడింది. ఓసారి బియ్యం బదులు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాక మళ్లీ బియ్యం కావాలని లబ్దిదారులు అడిగితే పోర్టబిలిటీ ఎలా ఇవ్వాలన్న దానిపై అధ్యయనం చేస్తోంది. అలాగే డబ్బు తీసుకుంటే బియ్యంకార్డు తీసేస్తారనే ఆందోళన కూడా లబ్దిదారుల్లో ఉంది.

బియ్యం బదులు నగదు
ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్ధ ద్వారా సరఫరా చేస్తున్న నెలవారీ బియ్యానికి డిమాండ్ అంతంతమాత్రంగానే ఉంటోంది. ప్రభుత్వం నాణ్యమైన బియ్యం ఇస్తున్నట్లుచెప్పుకుంటున్నా దాన్ని తీసుకుని వండుకుని తినే వారు చాలా తక్కువ. ఈ బియ్యం తీసుకుని దాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడమో లేక రేషన్ డీలర్ల వద్ద అమ్ముకోవడమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బియ్యానికి బదులుగా అదే డబ్బు తామే ఇస్తే ప్రజల్లో పరపతి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బియ్యం బదులు డబ్బులు ఇచ్చే పథకం రూపకల్పనకు సిద్ధమవుతోంది.

మళ్లీ బియ్యం కావాలంటే
ప్రభుత్వం ప్రస్తుతం బియ్యానికి బదులు నగదు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం లబ్దిదారుల నుంచి సంతకాలు తీసుకుని నగదు ఇవ్వాలని నిర్ణయించింది.అయితే ఓసారి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాక తిరిగి బియ్యమే కావాలని లబ్దిదారులు కోరితే అప్పుడు ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇలా పలుమార్లు ఆప్షన్లు మార్చుకుంటుంటే పథకం అమలు కష్టతరంగా మారుతుంది. అందుకే పోర్టబిలిటీ ఇచ్చే విషయంలో ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.

కార్డు తీసేస్తారనే భయాలు
అదే సమయంలో ప్రభుత్వం బియ్యానికి బదులు నగదు ఇవ్వడం మొదలుపెట్టాక బియ్యం కార్డు తొలగిస్తుందనే భయాలు కూడా లబ్దిదారుల్ని వెంటాడుతున్నాయి. ప్రభుత్వం బియ్యానికి బదులు నగదు ఇవ్వాలన్న ప్రతిపాదన వెనుక కార్డుల్లో కోత విధించాలన్న వ్యూహం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో లబ్దిదారుల్లోనూ అదే ఆందోళన మొదలైంది. దీనిపై ఇవాళ మంత్రి నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. విపక్షాలు చెప్తున్నది నిజం కాదని, ఎవరి కార్డులూ పోవని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ నగదు కూడా మహిళల ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని అపోహలు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications