సంక్రాంతికి రాజు గారు వస్తున్నారా ? రఘురామపై సొంత జిల్లాలో చర్చ- బెట్టింగులకూ రెడీ
ఏపీలో క్షత్రియ సామాజిక వర్గం జనాభా అధికంగా ఉండేది గోదావరి జిల్లాల్లోనే. సంక్రాంతి సందర్భఁగా అత్యధిక స్ధాయిలో కోడి పందాలు ఆడేది, ప్రోత్సహించేది కూడా వారే. అందులోనూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అంటేనే సంక్రాంతి కోడి పందాలు అనేంతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు కోడి పందాలకు అనుకూలంగా సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడిన చరిత్ర ఆయనది. దీంతో ఈ ఏడాది సంక్రాంతికి రాజు గారు జిల్లాకు వస్తున్నారా లేదా అన్న చర్చ ఓ రేంజ్లో సాగుతోంది. ఎందుకంటే వైసీపీతో విభేదించడం మొదలుపెట్టాక ఢిల్లీకే పరిమితమైన ఆయన వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ తీసుకుని మరీ హస్తినలోనే ఏడాదిగా ఉండిపోవడమే కారణం.
గోదావరిలో సంక్రాంతి కోడిపందాలు
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పేరు చెబితే గుర్తుకొచ్చేవి సంక్రాంతి ముగ్గులు, వంటలు ఆ తర్వాత కోడి పందాలు. అందులోనూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం బెల్ట్లో సంక్రాంతి కోడి పందాలు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందాయి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి జనం కోడి పందాలు ఆడటం ఆనవాయితీగా వస్తోంది.
అంతెందుకు ఏపీ విభజన జరిగిపోయినా ప్రతీ ఏటా సంక్రాంతికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడికి వచ్చి వేడుకల్లో పాల్గొంటూనే ఉంటారు. ఇక్కడి ప్రజలు దీన్ని తమ సంప్రదాయంగా చెబుతుంటారు. బయటి వారికి మాత్రం ఇది మూగజీవాల హింసగా, జూదంగా కనిపిస్తుంటుంది. అయినా ఇన్నేళ్లలో ఎప్పుడూ కోడి పందాలు ఆగింది లేదు. వీటిపై హైకోర్టు, సుప్రీంకోర్టులు ప్రతిసారీ ఎన్నో ఆదేశాలు అచ్చినా వాటి ప్రభావం నామమాత్రమేనని ఇక్కడ ఎవరిని అడిగినా చెబుతారు. దీంతో మరోసారి ఇక్కడ సంక్రాంతి సంబరాలకూ, కోడి పందాలకు రంగం సిద్ధమైపోతోంది.
పశ్చిమలో రఘురామ సంక్రాంతి
గోదావరి జిలాల్లో సంక్రాంతి కోడి పందాల జోరు ఎక్కువగా ఉంటున్నా ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ ప్రభావం మరికాస్త ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నరసాపురం నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సంక్రాంతి కోడి పందాలకు ప్రత్యేక స్ధానం ఉంది. వీటికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు గతంలో ప్రజాప్రతినిధిగా లేకపోయినా రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడారు. ప్రతీ ఏటా సంక్రాంతికి రాజుగారి పేరు తలచుకోకుండా ఇక్కడ కోడి పందాలు జరగవంటే అతిశయోక్తి కాదు. దీంతో ఈ ఏడాది కూడా రాజు గారి రాక కోసం పశ్చిమగోదావరిలో సంక్రాంతి ఎదురుచూస్తోంది.
రాజు గారి రాకపై బెట్టింగులకూ రెడీ
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేడుకలు. అదీ తన సొంత నియోజకవర్గం నరసాపురంలో కోడి పందాలకు పెట్టింది పేరు. అవి జరగకపోతే సంక్రాంతే పూర్తి కాదన్న ఫీలింగ్. కానీ ప్రస్తుతం తాను ఢిల్లీలో ఉంటున్నారు. గతేడాది సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నాక ఢిల్లీ వెళ్లిపోయిన రఘురామకృష్ణంరాజు ఏడాది పూర్తవుతున్నా నరసాపురానికి రాలేదు. దీంతో ఈసారి సంక్రాంతికి రాజుగారు వస్తున్నారా అన్న ప్రశ్న ఇక్కడ తరచుగా వినపడుతోంది. రాజుగారితో కలిసి సంక్రాంతి జరుపుకునే వారంతా ఇప్పుడు ఆయన రాక కోసం ఎదురుచూస్తుంటే, నియోజకవర్గంలో ప్రజలు సైతం రాజు గారు వస్తారా లేదా అనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్లయితే రఘురామ ఈసారి నియోజకవర్గానికి వస్తారా రారా అన్న అంశఁపై బెట్టింగులు వేసేందుకు సైతం సిద్ధమైపోతున్నారు.
Recommended Video
రాజు గారి ఎంట్రీకి అనుకూల పరిస్ధితులు
ప్రస్తుతం నరసాపురంలో సంక్రాంతి వేడుకలకు రంగం సిద్దమవుతోంది. గతంలో రఘురామకృష్ణంరాజు వైసీపీ అధిష్టానంతో విభేదించి రాష్ట్రం వీడే నాటికి పరిస్ధితులు ఆయనకు అనుకూలంగా లేవు. ఢిల్లీలో పరిచయాలు, బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఆయనకు అవసరం. సొంత నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోనూ వైసీపీ నేతలు తనకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు.
ఇప్పుడు ఏడాది తర్వాత పరిస్ధితుల్లో చాలా మార్పు వచ్చింది. రఘురామకృష్ణంరాజును వైసీపీ అధిష్టానంతో పాటు స్ధానిక ఎమ్మెల్యేలు కూడా లైట్ తీసుకున్నారు. ఆయన రోజూ రచ్చబండ పేరుతో విమర్శలు చేస్తున్నా ఎవరూ స్పందించడం లేదు. గతంలో వైసీపీ నేతల దాడుల భయంతో ఆయన ఢిల్లీకి వెళ్లిపోవడమే కాకుండా కేంద్ర హోంశాఖను అడిగి వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మారిన పరిస్ధితుల్లో అదే సెక్యూరిటీతో ఆయన నరసాపురానికి వచ్చే వీలుంది. దీంతో ఆయన సంక్రాంతి సంబరాలకు తప్పకుండా హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది.